కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: రఘునందన్ రావు

కేసీఆర్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలి: రఘునందన్ రావు

రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతిపై సీఎం కేసీఆర్ మాట్లాడాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఉందని ..దళిత బంధులో ప్రజాప్రతినిధులు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు  తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆరే చెప్పారని.. దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. హైకోర్టు సుమోటోగా తీసుకుని సీఎం కేసీఆర్ కు  నోటీసులివ్వాలన్నారు .  దళితబంధులో అవినీతికి పాల్పడుతోన్న వారిపై చర్యలు తీసుకోకుండా..  తప్పు చేస్తున్న  మంత్రులు, ఎమ్మెల్యేలను కేసీఆర్ వెనకేస్తున్నారని విమర్శించారు రఘునందన్ రావు.

దళితబంధులో జరుగుతోన్న అవినీతిపై  సీఎం కేసీఆర్  హైకోర్టుకు లేఖ రాయాలని లేకపోతే ఏసీబీ డీజీకి అవినీతి చిట్టా వివరాలివ్వాలన్నారు రఘునందన్ రావు. ఈ రెండు జరగకపోతే ఏసీబీ డీజీ సీఎం కేసీఆర్ కు నోటీసులివ్వాలన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోని   కేసీఆర్ కు ముఖ్యమంత్రి  సీటులో కూర్చునే అర్హత లేదని విమర్శించారు.

ఊర్లలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకుంటోందని రఘునందన్ రావు ఆరోపించారు.  తప్పు చేస్తే తనయుడైనా..తనయ అయినా శిక్షిస్తానన్న కేసీఆర్ ఇవాళ ఒక సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఉపముఖ్యమంత్రి రాజయ్యపై  ఎలాంటి ఆరోపణలు రుజువు చేయకుండానే  క్యాబినెట్ నుంచి ఎలా తొలగించారో.. బీసీ మంత్రి ఈటల రాజేందర్ ను ఎలా తొలగించారో... మంత్రి నిరంజన్ రెడ్డిపై  అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఒక మంత్రిపై అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే  కేసీఆర్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు రఘునందన్ రావు.  ధరణిలో లోపాలున్నాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు  తప్పుబట్టినా మార్పులు చేయడం లేదన్నారు.  ప్రభుత్వం పేద రైతుల భూములను అప్పనంగా అమ్ముకుంటుందన్నారు . డబుల్ బెడ్రూంలో అవినీతి, ధరణిలో అవినీతి,  మిషన్ కాకతీయలో అవినీతి, దళితబంధులోనూ.. ఇలా ప్రభుత్వ పథకాలన్నింటిలో  దోపిడి జరుగుతోందనన్నారు రఘునందన్ రావు.