రాహుల్ సభ కోసం బాగా పని చేయాలె

రాహుల్ సభ కోసం బాగా పని చేయాలె

హైదరాబాద్: వరంగల్ సభతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో... శనివారం గాంధీ భవన్ లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వచ్చే నెల 6న వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభ జరగనుందని, ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. రాహుల్ సభతో కాంగ్రెస్ లో నూతనోత్తేజం వస్తుందన్న రేవంత్... సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 20 ఏళ్ళ వరకు చర్చించుకునేలా వరంగల్ సభను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు వరంగల్ సభ కోసం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. 2002లో వరంగల్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ జరిగిందని, ఆ సభకు సోనియా గాంధీ హాజరయ్యారని తెలిపారు. బీసీ గర్జన సభతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్ సభతో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ అని, కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ వాపోయారు. 
 

మరిన్ని వార్తల కోసం...

పాక్ డిగ్రీలు చెల్లవ్

మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రయోగించాలె