
ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ రాసిన వ్యాసం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ అడ్డదారులు తొక్కిందని రాహుల్ గాంధీ ఆ వ్యాసంలో పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు రాహుల్ గాంధీ వ్యక్తీకరించిన అంశాలు ప్రజాస్వామ్యవాదులను, మేధావులను ఆలోచనలో పడేశాయి. రాహుల్ గాంధీ బయటపెట్టిన మహారాష్ట్ర ఎన్నికల చిత్రవిచిత్రాలు ప్రజలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఓటర్ల సంఖ్య అమాంతం పెరిగిపోవడం, ఓటింగ్ శాతంలో భారీ తేడాలు నమోదు కావడం, ఎన్నికల సాక్ష్యాధారాలు బయట పెట్టకపోవడం మొదలైన అంశాలు భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తినే ప్రశ్నార్థకం చేస్తూ దాని పనితీరుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం పార్లమెంట్ ప్రత్యేకచట్టాన్ని రూపొందించాలని రాజ్యాంగ నిబంధన ఆదేశించినా చట్టం రూపుదిద్దుకోలేదు. 1991లో పార్లమెంటు ఎన్నికల కమిషన్ చట్టాన్ని ఆమోదించింది. ఇందులో కేవలం ఎన్నికల కమిషనర్ల వేతనం, సేవా నిబంధనలు మాత్రమే ఆమోదం పొందాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు అవకాశం కల్పించలేదు. ప్రధానమంత్రి సిఫార్సుల మేరకే రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023 కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషనర్లను నియమించడానికి పార్లమెంటు చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించాలని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు రుచించని ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా నిబంధనలకు సంబంధించిన బిల్లు తయారు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి గతంలో గోస్వామి కమిటీ, లా కమిషన్ సూచనలు, సుప్రీంకోర్టు 2023లో చేసిన ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
ఈసీ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్థకం
ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లు 2023 డిసెంబర్ 12న రాజ్యసభ, డిసెంబర్ 21వ తేదీన లోక్సభ ఆమోదంతో చట్టంగా అమల్లోకి వచ్చింది. చట్టం ప్రకారం సెలక్షన్ కమిటీ సిఫార్సు మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. దీనిప్రకారం ప్రభుత్వం (ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రి) సూచించిన వ్యక్తులే ఎన్నికల కమిషనర్లుగా నియామకం అవుతారు. సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించడంలోని నైతికతనే రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. ముగ్గురు సభ్యులలో మెజారిటీ సూత్రం ప్రకారం ప్రతిపక్ష నాయకుడి సూచనకు అర్థమే లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తులనే ఎన్నికల కమిషనర్లుగా నియమించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.
అమాంతం పెరిగిన ఓటర్ల సంఖ్య
రాహుల్ గాంధీ పేర్కొన్న విషయాల ప్రకారం 2019 మహారాష్ట్ర విధానసభ ఎన్నికల్లో నమోదైన ఓటర్ల సంఖ్య 8. 98 కోట్లు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి ఆ సంఖ్య 9.29 కోట్లకు పెరిగింది. అంటే 2019 నుంచి 2024 లోక్సభ ఎన్నికల నాటికి ఐదు సంవత్సరాల కాలంలో పెరిగిన ఓటర్ల సంఖ్య కేవలం 31 లక్షలు మాత్రమే. 2024 మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలు (ఏప్రిల్, మే) నుంచి 2024 నవంబర్ విధానసభ ఎన్నికల నాటికి ఐదు నెలల కాలంలో ఓటర్ల సంఖ్య 9.70 కోట్లకు పెరిగింది. స్వల్ప కాలంలో 41 లక్షల కొత్త ఓటర్లు పుట్టుకు వచ్చారు. ఐదు సంవత్సరాల కాలంలో 31 లక్షల ఓటర్లు(3.45 శాతం) పెరిగితే కేవలం ఐదు నెలల కాలంలోనే 41 లక్షల ఓటర్లు(4.41 శాతం) నమోదు కావడంలో ఇంద్రజాల కనికట్టు ఏమిటో పరిశీలకులకు అంతుపట్టడం లేదు. రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఓటర్ల సంఖ్యలో పెరుగుదల వాస్తవమా? అవాస్తవమా? ఓటర్ల సంఖ్య అమాంతం పెరగడానికి గల కారణాలేమిటి? బోగస్ ఓటర్లు ఉన్నారా? లేరా? మొదలగు ప్రశ్నల నిజానిజాలను ఎన్నికల కమిషనే నిగ్గుతేల్చాలి. రాహుల్ గాంధీ చెప్పిన అంశాలలో అసత్యం ఉంటే పౌర సమాజంలో అతని విశ్వసనీయతే దెబ్బతింటుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం.
సీసీటీవీ ఫుటేజ్ ప్రజలకు అందుబాటులో ఉంచాలి
మహారాష్ట్రలోని ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించి వీడియోలను, సీసీటీవీ ఫుటేజీని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం 1961 నాటి ఎన్నికల నిర్వహణ నియమావళిలోని సెక్షన్ 93 (2)(ఎ) సవరించి ప్రజలకు సీసీటీవీ ఫుటేజీ, ఎలక్ట్రానిక్ రికార్డుల అందుబాటును నిలిపివేసినట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన పరిణామం. లోక్సభలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు తన వ్యాసంలో లేవనెత్తిన అంశాలకు తగు రీతిలో భారత ఎన్నికల సంఘం నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వాలి. పోలైన ఓట్ల వివరాలు, సాయంత్రం ఐదు గంటల తరువాత జరిగిన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ, మిషన్ రీడింగ్ ఓటర్ రోల్స్ ఎన్నికల సంఘం బయటపెట్టి తమ నిష్పాక్షికతను రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి దాపరికం పనికిరాదు. పారదర్శకమైన పనితీరే ప్రజాస్వామ్య విజయానికి, ఎన్నికల కమిషన్ పవిత్రతకి గీటురాయి.
ఓటింగ్ ముగింపు వేళలో భారీ పెరుగుదల
రాహుల్ గాంధీ విశ్లేషణలో మహారాష్ట్రలో సాయంత్రం ఐదు గంటల సమయానికి 58. 22 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఐదుగంటల అనంతరం పోలింగ్ కేంద్రాల్లో ఉన్నవారు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంతో 66.05 ఓటింగ్ శాతం నమోదైనట్లు మరుసటి రోజు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటల అనంతరం పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 7.83 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాహుల్ చెబుతున్నారు. పోలింగ్ గడువు ముగిసే సమయం తరువాత (నిర్ణీత పరిధిలో ఉన్నవారు) ఓటుహక్కు వినియోగించుకున్న ఓటర్ల సంఖ్య మధ్య తేడా 2009లో- 0.50 శాతం, 2014లో 1.08 శాతం, 2019లో 0.54 శాతం కాగా 2024లో ఈ తేడా భారీగా 7.83 శాతంగా పెరిగిందని రాహుల్ గాంధీ చెబుతున్న లెక్కలు మన ఎన్నికల ప్రక్రియపై ఎన్నో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి.
బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి