అధికారం కోసం దేశాన్ని బీజేపీ ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశం కొద్దిమంది చేతుల్లోకి పోతుందని..దేశం సొమ్మునంతా కొందరికే పంచిపెడుతున్నారని మండిపడ్డారు. అందుకే బీజేపీపై పోరాటం చేసేందుకు INDIA పేరుతో కూటమి ఏర్పాటు చేసినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రజల కోసం చేసే ఈ పోరాటమని..అందుకే ఇండియా పేరు వచ్చేలా పెట్టామని చెప్పారు. ఈ పోరాటం ఎన్టీఏ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం కాదని..దేశ ప్రజల స్వాతంత్య్రం కోసం, దేశ స్వేచ్ఛ కోసం జరిగే యుద్ధమన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిందని మండిపడ్డారు.
జాతీయ స్థాయిలో 26 విపక్ష పార్టీలు INDIA కూటమిగా ఏర్పాటయ్యాయి. INDIA అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. కూటమికి INDIA అని పేరు రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. రాహుల్ ప్రతిపాదనను విపక్షాలు ఆమోదించాయి. ఈ సమావేశానికి మొత్తం 26 పార్టీలు హాజరైనట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దేశ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించేందుకు బెంగుళూరులో విపక్షాల భేటీ జరిగిందన్నారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.