ఈ రోజుతో 2023 ( డిసెంబర్31) ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరి ఆదివారాన్ని ఆరెంజ్ మార్మలాడే(ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జామ్) అనే రెసీపీ ప్రీపరేషన్తో గడిపారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్. ఈ వంటకం రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు ఇష్టమైనదట. అందుకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లోగోతో కూడిన తన యూట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేశారు.
నిత్యం దేశ రాజకీయాల్లో తలమునకలై ఉండే తల్లీ కొడుకులు కిచెన్లో కనిపిస్తే? ఎవరా తల్లీకొడుకులు అంటే.. ఒకరు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. ఆమె కొడుకు ఎంపీ రాహుల్ గాంధీ..నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ వీరిద్దరూ తయారు చేసిన ‘ఆరెంజ్ మార్మలాడ్’ రెసీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆసక్తికరమైన రెసిపీ గురించి.. వారిద్దరు ఇది తయారు చేయడం వెనుక విశేషం గురించి చదవండి.
ఈ వీడియోలో.. సోనియా, రాహుల్ ఇద్దరు కలిసి కిచెన్ గార్డెన్లోకి వెళ్లి పండ్లను తెచ్చి ఒక బుట్టలో వేసుకుని వస్తారు. ఈ రెసిపీ కోసం పూర్తిగా పండినవే కోయాలని సోనియా చెప్పగా, రాహుల్ నవ్వుతూ.. అవే ఎందుకు కోయాలంటూ చిలిపిగా ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరు వంటగదిలోకి వచ్చి వాటిని శుభ్రం చేసి నారింజ జ్యూస్ తీశారు. ఆ జ్యూస్ని, చక్కెరని అల్యూమినియం పోసి స్టవ్పై ఉంచి ఉడికించారు.
కిచెన్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని.. ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందని అన్నారు. రాహుల్ ఆ మిశ్రమాన్ని కలుపుతూ అమ్మా బీజేపీ వాళ్లు ఈ జామ్ కావాలంటే..వాళ్లకు కూడా ఇద్దామా.. అని సరదాగా అన్నారు రాహుల్. అందుకు ప్రతిగా సోనియా మనపైకే తిరిగి విసిరేస్తారు అని నవ్వుతూ సెటైర్ వేశారు. మంచిది అప్పుడు ఆ జామ్ మొత్తం మనకే సొంతం అని రాహుల్ అనడంతో ఇరువురి ముఖాల్లో పెద్దగా నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ దశాబ్దాల క్రితం భారతీయ వంటకాలకు తాను అలవాటు పడటానికి ఎల ఆ కష్టపడ్డానో వివరించారు.
ఇక ఈలోగా మార్మాలాడే రెసీపీ తయారవ్వడంతో ఆ మిశ్రమాన్ని గాజు సీసాల్లో తల్లి కొడుకులు ఇరువురు సర్ధి వాటి మూతలతో క్లోజ్ చేసి పైన ఒక లవ్ సింబల్ ఆకారంలోని కార్డుని ఉంచారు. ఆ కార్డుపై ప్రేమతో మీ సోనియా, రాహుల్ అని రాశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.