
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటికి దేశ ప్రధాని కాలేరన్నారు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ. ఎదైనా అద్భుతం జరిగితే తప్ప రాహుల్ ప్రధాని అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ అమేథీ, వయానాడ్ నుండి పోటీ చేయడంపై ఆమె స్పందించారు. ఎన్నికల్లో ఎవరైనా రెండు సీట్లలో లేదా అంతకన్నా ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయెచ్చన్నారు. అంతేకాక లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రభావం ఏమీ ఉండదని ఆమెకు కార్యకర్తల బలం లేదని తెలిపారు. సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపుపై ఆమె ధీమా వ్యక్తం చేశారు. తన భర్త సంజయ్ గాంధీ రెండు సార్లు విజయం సాధించారన్న మేనకా గాంధీ… గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ గెలుపొందారన్నారు. ఈసారి కూడా తనతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారని… ఈ సారి కూడా విజయం మాదేనన్నారు. ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ,బీఎస్పీ కూటమితో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తామే మెజార్టీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై మేనకా గాంధీ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.