బుల్లెట్ రైలు వచ్చేస్తుంది : శంషాబాద్ నుంచి వైజాగ్ ప్రత్యేక రైల్వే లైన్

బుల్లెట్ రైలు వచ్చేస్తుంది : శంషాబాద్ నుంచి వైజాగ్ ప్రత్యేక రైల్వే లైన్

తెలుగు రాష్ట్రాల మధ్య బుల్లెట్ రైలు రానుందా...?  విశాఖ పట్నం నుంచి శంషాబాద్ మధ్య బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు కేంద్ర రైల్వే శాఖ నిర్ణయం మరింత బలం చేకూరుస్తోంది. 

 రెండు రాష్ట్రాల అనుసంధానతను మరింత బలోపేతం చేసేందుకు రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం-- - విజయవాడ - తెలంగాణలోని శంషాబాద్ మధ్యలో మొదటిది కగా.. విశాఖపట్నం - విజయవాడ - కర్నూలు మార్గంలో రెండో రైల్వే లైన్. ఈ రెండు లైన్ల కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ  దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే అయిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడనుంది. ఈ రెండు లైన్లలో ఒకటైన విశాఖపట్నం, శంషాబాద్ లైన్ మధ్య బుల్లెట్ రైలు నడవనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ రైల్వే లైన్ గరిష్ట వేగం  220 kmph . ఈ నేపథ్యంలో  హైదరాబాద్ నుంచి విశాఖ పట్నం దూరం 618 కిలో మీటర్లు కాగా..బుల్లెట్ రైల్లో ప్రయాణిస్తే కేవలం 3 గంటల్లో విశాఖపట్నం చేరుకోవచ్చు. 
 

ఈ రైల్వే లైన్లకు సంబంధించి కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి అనేక సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్‌ను కలిసి లేఖలు అందజేశారు.  ఈ సూపర్‌ఫాస్ట్ రైల్వే లైన్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు  ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.

ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్రప్రభుత్వం.. అనుసంధాతను మెరుగుపరిచే దిశగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల  అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను కేంద్రం అందించింది.  వీటికి అదనంగా తెలంగాణలో వ్యాగన్ తయారీ, ఓవర్‌ హాలింగ్ కేంద్రం, ఎంఎంటీఎస్ (రెండోదశ), సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, చర్లపల్లి టర్మినల్ వంటి ప్రాజెక్టులను కేంద్రం చేపడుతోంది.