
- కొత్త నిబంధన తీసుకొచ్చిన రైల్వే శాఖ
- జులై 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. దళారులకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ వెబ్సైట్/యాప్లో ఆధార్ అథంటికేటెడ్ విధానం అమలు చేయనున్నది. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకున్నవారు తప్పనిసరిగా ఆధార్ అథంటికేషన్ ఉండాల్సిందే అని రైల్వే శాఖ స్పష్టం చేసింది. జులై 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు సర్క్యూలర్ జారీ చేసింది. జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్ లో ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేయనున్నట్లు తెలిపింది. గత 6 నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీలను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్ వేర్ ఉపయోగించినందుకే ఐడీలను బ్లాక్ చేశామని తెలిపింది. ఫోన్కు వచ్చే ఆధార్ ఓటీపీ ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్లు బుక్ అవుతాయని చెప్పింది. ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. అంటే.. ఏసీ క్లాస్కు ఉదయం 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ క్లాస్కు ఉదయం 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్ లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.