
- అత్యధికంగా జనగామ జిల్లా మల్కాపూర్లో 8.2 సెంటీమీటర్ల వాన
- మరో 13 జిల్లాల్లోనూ వర్షపాతం నమోదు
హైదరాబాద్, వెలుగు: ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. రుతుపవనాలు ఏపీలో విస్తరిస్తుండటంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తున్నది. బుధవారం సాయంత్రం నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం, జనగామ, హనుమకొండ, మంచిర్యాల, కుమ్రంభీం, మంచిర్యాల, రంగారెడ్డి, నాగర్కర్నూల్ కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామలో భారీ వర్షం దంచికొట్టింది. జిల్లాలోని మల్కాపూర్లో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. స్టేషన్ఘనపూర్లో 6.9 సెంటీమీటర్ల వాన కురిసింది.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 5.9, నల్గొండ జల్లా మాడుగులపల్లిలో 5.1, హనుమకొండ జిల్లా వేలేరులో 4.8, యాదాద్రి జిల్లా జంగాంలో 4.5, మేడ్లవాయిలో 4.3, నార్కెట్పల్లిలో 4.2, కొండపర్తిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్సిటీలోనూ వర్షం దంచి కొట్టింది. దాదాపు గంటన్నరపాటు వర్షం కురిసింది. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో అత్యధికంగా 1.7 సెంటీమీటర్ల వాన పడింది. కాప్రా, షేక్పేట, చార్మినార్, బహదూర్పురాల్లోనూ వర్షం కురిసింది. వానలు కురవడంతో ఆయా జిల్లాల్లో రైతులకు కాస్తంత ఊరట లభించినట్టయింది.
పొద్దంతా హీట్ వేవ్స్
సాయంత్రం వానలు పడినా.. పొద్దంతా ఎండ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంతకుముందుతో పోలిస్తే టెంపరేచర్లు తగ్గినా పలు జిల్లాల్లో హీట్వేవ్స్ నమోదయ్యాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు, హనుమకొండ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాడ్పుల పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, గురువారం మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణాదిలో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, బుధవారం అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లా నుష్టులాపూర్లో 42.8, ఖమ్మం జిల్లా మధిరలో 42.2, కరీంనగర్ జిల్లా ఖాసింపేటలో 42.1, ఆసిఫ్నగర్లో 41.8, సిద్దిపేట జిల్లా కట్కూర్, సిరిసిల్ల జిల్లా కందికట్కూర్ మార్థానపేటలో 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.