హమ్మయ్య వర్షాలు షురూ..పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు

హమ్మయ్య వర్షాలు షురూ..పలు జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వానలు
  • అత్యధికంగా జనగామ జిల్లా మల్కాపూర్​లో 8.2 సెంటీమీటర్ల వాన
  • మరో 13 జిల్లాల్లోనూ వర్షపాతం నమోదు

హైదరాబాద్, వెలుగు:  ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షాలు ఉపశమనాన్నిచ్చాయి. రుతుపవనాలు ఏపీలో  విస్తరిస్తుండటంతో ఆ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తున్నది. బుధవారం సాయంత్రం నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, ఖమ్మం, జనగామ, హనుమకొండ, మంచిర్యాల, కుమ్రంభీం, మంచిర్యాల, రంగారెడ్డి, నాగర్​కర్నూల్​ కరీంనగర్​ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జనగామలో భారీ వర్షం దంచికొట్టింది. జిల్లాలోని మల్కాపూర్​లో అత్యధికంగా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  స్టేషన్​ఘనపూర్​లో 6.9 సెంటీమీటర్ల వాన కురిసింది. 

నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో 5.9, నల్గొండ జల్లా మాడుగులపల్లిలో 5.1, హనుమకొండ జిల్లా వేలేరులో 4.8, యాదాద్రి జిల్లా జంగాంలో 4.5, మేడ్లవాయిలో 4.3, నార్కెట్​పల్లిలో 4.2, కొండపర్తిలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. హైదరాబాద్​సిటీలోనూ వర్షం దంచి కొట్టింది. దాదాపు గంటన్నరపాటు వర్షం కురిసింది. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో అత్యధికంగా 1.7 సెంటీమీటర్ల వాన పడింది. కాప్రా, షేక్​పేట, చార్మినార్, బహదూర్​పురాల్లోనూ వర్షం కురిసింది. వానలు కురవడంతో ఆయా జిల్లాల్లో  రైతులకు కాస్తంత ఊరట లభించినట్టయింది. 

పొద్దంతా  హీట్ వేవ్స్

సాయంత్రం వానలు పడినా.. పొద్దంతా ఎండ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంతకుముందుతో పోలిస్తే టెంపరేచర్లు తగ్గినా పలు జిల్లాల్లో హీట్​వేవ్స్​ నమోదయ్యాయి. ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో  తీవ్రమైన వడగాడ్పులు,  హనుమకొండ, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్​, నిజామాబాద్​ జిల్లాల్లో వడగాడ్పుల పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, గురువారం మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణాదిలో మరికొన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, బుధవారం అత్యధికంగా నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​లో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్​ జిల్లా నుష్టులాపూర్​లో 42.8, ఖమ్మం జిల్లా మధిరలో 42.2, కరీంనగర్​ జిల్లా ఖాసింపేటలో 42.1, ఆసిఫ్​నగర్​లో 41.8,      సిద్దిపేట జిల్లా కట్కూర్​, సిరిసిల్ల జిల్లా కందికట్కూర్​ మార్థానపేటలో 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.