హైదరాబాద్, వెలుగు: రాష్ట్రమంతా ముసురేసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఎడతెరపి లేకుండా వానలు పడ్డాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పడిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. టీఎస్డీపీఎస్ డేటా ప్రకారం, సోమవారం 20 చోట్ల మోస్తరు వానలు, 217 చోట్ల తేలికపాటి, 178 ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో 5.1 సెంటీమీటర్లు, మేడ్చల్లోని రామంతాపూర్లో 3, రంగారెడ్డిలోని అబ్దుల్లాపూర్మెట్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. పలు జిల్లాల్లో రానున్న 4 రోజులలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మిగులు వర్షపాతం..
రాష్ట్రంలో జూన్ మొదట్లో లోటు వర్షపాతం నమోదు కాగా, రుతుపవనాలు వచ్చాక పరిస్థితి మారింది. మూడో వారం నుంచి లోటు వర్షపాతం నుంచి మిగులుకు చేరింది. నాలుగో వారంలో వర్షాలు కాస్త తగ్గినా తాజాగా మళ్లీ కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో సాధారణంగా ఇప్పటివరకు సగటున 153.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యేదని, ఈ ఏడాది 201.1 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయ్యిందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. 4 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 17 జిల్లాల్లో మిగులు వర్షపాతం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం పడింది. మంగళవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ రూరల్, హనుమకొండ, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.