ఆత్మ నిర్భర్‌‌ భారత్‌: డిఫెన్స్‌లో 101 వస్తువుల దిగుమతులపై నిషేధం

ఆత్మ నిర్భర్‌‌ భారత్‌: డిఫెన్స్‌లో 101 వస్తువుల దిగుమతులపై నిషేధం
  • ప్రకటించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ: డిఫెన్స్‌కు సంబంధించి కొన్ని దిగుముతలపై రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్‌లో వాడే 101 వస్తువుల దిగుమతిపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. ‘ఆత్మ నిర్భర్‌‌ భారత్‌’ కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.ఆయుధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులు ఇక నుంచి మన దేశంలోనే తయారవుతాయని, ఇది మన రక్షణ శాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. దీంతో డొమస్టిక్‌ రంగానికి వచ్చే ఆరేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల కాంట్రాక్టులు వస్తాయని మినిస్టర్‌‌ చెప్పారు. ఆర్టిలరీ గన్స్‌, అసల్ట్‌ రైఫిల్స్‌, కార్వీటీస్‌, సోనార్‌‌ సిస్టమ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌, లైట్‌ కాంబాట్‌ హెలికాఫ్టర్స్‌, రాడార్స్‌ తదితర వస్తువులు ఈ లిస్ట్‌లోకి వస్తాయని లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఆర్మర్డ్‌ ఫైలింగ్‌ వెహికిల్స్‌ (ఏఎఫ్‌వి) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్టేక్‌ హోల్డర్స్‌, ఆర్మ్డ్‌ ఫోర్స్‌, పబ్లిక్‌, ప్రేవేట్‌ ఇండస్ట్రీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ లిస్ట్‌ తయారు చేశామని రాజ్‌నాథ్‌ చెప్పారు. ఏప్రిల్ 2015 నుంచి ఆగస్టు 2020 మధ్య త్రివిధ దళాలకు 3.5 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టుల ద్వారా పరికరాలు దిగుమతి అయ్యాయి. ఇందులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్సుకి కలిపి 1,30,000 కోట్ల విలువైన వస్తువులు, 1,40,000 కోట్ల విలువైన నావికాదళ ఆయుధాలు, పరికరాలు అవసరమవుతాయని అంచనా. జాబితాలో ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కూడా ఉన్నాయి. కాగా వీటి దిగుమతిపై 2021 డిసెంబర్ నుంచి నిషేధం విధించారు. ఐదు వేల కోట్లు విలువైన 200 వీల్డ్ ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికిల్స్ కి ఆర్మీ కాంట్రాక్టు ఇవ్వనుంది. రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం 2020 నుండి 2024 మధ్య అమలు చేయడానికి రక్షణశాఖ ప్రణాళిక రూపొందించింది. “ ఈ నిర్ణయం వల్ల రక్షణ శాఖ వారి సొంత డిజైన్‌, సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు. ఇది పరిశ్రమకు సాయపడుతుంది. అంతే కాకుండా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌‌డీవో) రూపొందించిన, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించుకుని అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడుతుంది” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.