రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా అరెస్ట్.. ఐదు కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం..

రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా అరెస్ట్.. ఐదు కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం..

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గురువారం ( జూన్ 19 ) అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బుద్వేల్ చెందిన డి.జగదీష్‌(22), చింతల్‌మెట్‌కు చెందిన ఎం.రాముకుమార్‌(23), బుద్వేల్‌కు చెందిన బి.మనోజ్‌(19), బి.నరేందర్‌(21)తో పాటు మహేష్ ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు.

ముఠా పోలీసులను చూసి ఓవర్ యాక్షన్ చేయడంతో అనుమానం రావడంతో సినీ పక్కీలో చేజ్ చేసి... రాజేంద్రనగర్ పట్టుకొండ దగ్గర గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. ముఠా దగ్గర నుంచి ఐదు కిలోల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.గంజాయిని స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజేంద్రనగర్‌ పోలీసులు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ లో గంజాయి ముఠా ఆగడాలు ఎక్కువైపోతున్నాయి.. నగరంలో హాష్ ఆయిల్, గంజాయి విక్రయిస్తున్న ముఠాను నార్త్​ జోన్​ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.6.50 లక్షల విలువైన హాష్  ఆయిల్, గంజాయి, చరాస్, రెండు డాగర్లు, మూడు బైక్​లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ సుదీంద్ర బుదవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

నార్త్ జోన్​  టాస్క్ ఫోర్స్​, మాసబ్ ట్యాంక్​ పోలీసులు మాసబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ పింఛన్​ ఆఫీస్ బస్ స్టాప్ సమీపంలో దాడులు నిర్వహించారు. సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్, మహమ్మద్ ఫైజాన్, హర్షిత, సమీర్ అనే నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారంలో నివసించే సామ్ అజయ్, వీరచారిని కూడా అరెస్టు చేశారు. నాగపూర్​ నుంచి సరుకు తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.