జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం... తొలి దశలో లక్ష మందికి రూ.50 వేలు, రూ. లక్ష రుణాల పంపిణీ

జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం... తొలి దశలో లక్ష మందికి రూ.50 వేలు, రూ. లక్ష రుణాల పంపిణీ

హైదరాబాద్, వెలుగు:రాజీవ్ యువ వికాసం స్కీమ్​లో భాగంగా రుణాల పంపిణీకి సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి 9 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణాలను పంపిణీ చేయనున్నారు. ఈ నెల10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇవ్వనుండగా, 15 నుంచి యూనిట్లు గ్రౌండింగ్ కానున్నాయి. లబ్ధిదారుల తుది జాబితా బ్యాంకర్ల నుంచి అందిందని, తర్వాత అది జిల్లా ఇన్​చార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లకు చేరిందని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. 

తొలి దశలో రూ.50 వేలు, రూ. లక్ష లోపు రుణాల కోసం అప్లై చేసి, అర్హులుగా ఎంపికైన లక్ష మంది లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ఈ ఏడాది రూ.6 వేల కోట్లతో మొత్తం 5 లక్షల మందికి స్కీమ్​ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గత నెల  27తో పూర్తయింది. ఈ పథకానికి 4 కేటగిరీల రుణాలకు 16.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 

రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల రుణాలకు అత్యధికంగా 12 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. తొలి దశలో రూ.50 వేలు, రూ.లక్ష వరకు రుణాలు ఇస్తుండగా దశల వారీగా మిగతా కేటగిరీలకు రుణాలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.  రూ.50 వేల లోపు రుణాన్ని వంద శాతం సబ్సిడీతో ఇవ్వనుండగా, రూ. లక్ష లోపు రుణానికి 90 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు.  మిగతా కేటగిరీలకు 80 శాతం, 70 శాతం సబ్సిడీ అందజేయనున్నారు.