అమరావతి: ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి, నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు విజయం సాధించారు. మొత్తం 175 ఓట్లకు గాను 173 ఓట్లు పోలయ్యాయి.
గెలుపొందిన ఒక్కొక్క అభ్యర్థికి 38 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. అవన్నీ టీడీపీ సభ్యులవే. అసెంబ్లీ కమిటీ హాల్ లో శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టిన అధికారులు ఫలితాలను వెల్లడించారు.