ఏపీ నేతలతో గవర్నర్ తమిళి సైని కలిసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఏపీ నేతలతో  గవర్నర్ తమిళి సైని కలిసిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
  • ఏపీ బీజేపీ నేతలతో తెలంగాణ గవర్నర్ను కలిసిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

హైదరాబాద్: తెలంగాణ బీసీ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చకపోతే కేసీఆర్ సర్కార్ పై మరో ఉద్యమం తప్పదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ హెచ్చరించారు. ఉత్తరాంధ్రకు చెందిన 26కులాలను బీసీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ నాయకులతో కలసి రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళసైను కలసిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 

ఏపీ, తెలంగాణలోని బీసీల సమస్యలను బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ జాబితా నుంచి తొలగించిన ఏపీకి చెందిన 26బీసీ కులాలను  తిరిగి బీసీ జాబితాలో చేర్చేలా చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ .. తమ విజ్ఞప్తికి గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణలో ఉన్న ఆంద్రా సెటిలర్స్ ను కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న కేసీఆర్... మాట తప్పారని విమర్శించారు.

ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానని కడుపు కొట్టిండు 

ఆంధ్రా వాళ్లకు ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ కడుపు కొట్టిండని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా ఒక్క కలం పోటుతో 26కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందని విమర్శించారు. కేసీఆర్ చర్యతో స్కాలర్ షిప్ లు లేక బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కులాల పూర్వీకులకు ఆంధ్ర మూలాలు ఉండడమే నేరమా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.