‘ప్రధాని మోదీ గారు ‘పెద్ది’ గురించి అడిగితే.. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను’ అని అన్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం జూన్ 4న వరల్డ్వైడ్గా విడుదలవుతున్న సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా మేమంతా ఎంతో నిజాయితీగా చేశాం. అద్భుతమైన టీమ్ వర్క్ కుదిరింది. ఇది చాలా గొప్ప ఎంటర్టైనర్. ప్రేక్షకులను ఇన్స్పైర్ చేసేలా ఉంటుంది. పిల్లలతో కలిసి చూస్తే వాళ్లు చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇది మట్టి వాసన ఉన్న కథ. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు చాలామంది ట్రైబల్ ప్రాంతాల నుంచే వచ్చారు.
ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తాను వెస్ట్ బెంగాల్లో ప్రచారం చేస్తున్నప్పుడు కొందరు గ్రామీణ యువకులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారని చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం వారి గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్బాల్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అది చూపిస్తుంది అని మోదీ గారు నాతో అన్నారు.
‘పెద్ది’ కూడా అలాంటి ఒక కథ. ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడాడనేది ఇందులో చూస్తారు. ఇది లార్జ్ స్కేల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా’ అని చెప్పాడు. ఇదొక రూటెడ్ ఫిల్మ్ అని, ఇందులో నటించడం ఆనందంగా ఉందని జాన్వీ కపూర్ చెప్పింది. అందరిలో స్ఫూర్తిని నింపే చిత్రమిది అని నిర్మాత వెంకట సతీష్ కిలారు అన్నారు. నటులు బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ పాల్గొన్నారు.
