మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, ఎంటర్ప్రెన్యూర్ ఉపాసన కొణిదెల లేటెస్ట్ గా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. శుక్రవారం గువాహటిలోని ప్రసిద్ధ శక్తిపీఠం 'మా కామాఖ్య దేవి' ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే దర్శనం అనంతరం ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా "New Beginnings" అంటూ ఉపాసన పెట్టిన క్యాప్షన్పై నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ఎర్రటి సాంప్రదాయ సల్వార్ సూట్లో, చేతిలో పూల బుట్టలతో తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే, ఈ పర్యటన కంటే ఆమె పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సినీ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"మనలోని దైవత్వాన్ని వెలికితీసి, చెడును అంతం చేయి మా కామాఖ్య న్యూ బిగినింగ్స్.. డివైన్ శక్తి ధర్మ సేవ కర్మ" అంటూ ఉపాసన ఓ ఆధ్యాత్మిక సందేశాన్ని పంచుకున్నారు. ఇందులో ఆమె ప్రస్తావించిన 'న్యూ బిగినింగ్స్' అనే పదం వెనుక ఉన్న అసలు రహస్యమేంటని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఉపాసన హెల్త్కేర్ విభాగంలో కొత్త గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారా? లేక సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారా? అంటూ రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలే ఈ మెగా జంట తమ కుటుంబంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల ఫోటోలను పంచుకుంది. జూన్ 2023లో జన్మించిన ముద్దుల కూతురు క్లిన్ కారాతో పాటు, జనవరి 31, 2026న జన్మించిన కవల పిల్లలు అన్వీరా దేవి, శివరామ్ లతో కలిసి పూజలు నిర్వహించారు. కవలల రాకతో ఇల్లు దైవత్వంతో నిండిపోయిందని, తన డ్రీమ్ నెరవేరిందని ఉపాసన ఆనందం వ్యక్తం చేశారు. శివరామ్ పేరులో పరమశివుడు, శ్రీరాముడి దివ్యత్వాలు ఉండగా, అన్వీరా దేవి అంటే ధైర్యానికి, దైవిక శక్తికి సంకేతం వచ్చేలా నామకరణం చేశారు.
మరోవైపు రామ్ చరణ్ కూడా వృత్తిపరంగా బ్లాక్బస్టర్ ఫామ్లో ఉన్నారు. జాన్వీ కపూర్తో కలసి నటించిన భారీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది' జూన్ 2026లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రికార్డు వ్యూస్తో గ్లోబల్ వైడ్గా ట్రెండ్ అవుతోంది. ఒకవైపు చరణ్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే.. మరోవైపు ఉపాసన సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుడుతుండటంతో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
