
ఫాం హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతి ఎట్టకేలకూ జైలు నుంచి బయటకువచ్చారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయన.. బెయిల్పై విడుదలయయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిన నాలుగు రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఫాం హౌస్ కేసులో రామచంద్ర భారతి గురువారమే చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బంజారాహిల్స్ పోలీసులు మరో కేసులో ఆయనను అరెస్ట్ చేయడంతో బయటకు రాలేకపోయారు. ఫాం హౌస్ కేసులో ఏ3గా ఉన్న సింహయాజులు ఇప్పటికే బెయిల్పై విడుదల కాగా.. ఏ2గా ఉన్న నందకుమార్ను బంజారాహిల్స్ పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.
ఫోర్జరీ ఆధార్, పాస్పోర్ట్ మార్ఫింగ్ కేసుల్లో రామచంద్ర భారతిని, డెక్కన్ కిచెన్ లీజ్ తోపాటు మరో 5 కేసుల్లో నందకుమార్ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పీఎస్కు తరలించి విచారించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మెడికల్ టెస్టులు నిర్వహించి, నాంపల్లిలోని 3వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు రామచంద్రభారతికి బెయిల్ మంజూరు చేసింది. రెండు ష్యూరిటీలతో, రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. నందకుమార్కు14 రోజల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రామచంద్రభారతి ష్యూరిటీస్ సమర్పించకపోవడంతో ఆయనతోపాటు నందకుమార్ను చంచల్గూడ జైలుకు తరలించారు. పూచీకత్తు డిపాజిట్ చేసిన అనంతరం శుక్రవారం ఉదయం రామచంద్రభారతి విడుదలయ్యారు.