- అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ.. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సహకారం అందించాలని స్పష్టం చేశారు. సీఎం ఇప్పటికే డేటా సెంటర్ల అంశంపై సమీక్షలు నిర్వహించారని గుర్తుచేశారు. మహారాష్ట్ర, ఏపీ, ఉత్తరప్రదేశ్లలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను స్టడీ చేసి తెలంగాణలోనూ అదే స్థాయి ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు.
డేటా సెంటర్ల ఇన్వెస్టర్లు 100 శాతం గ్రీన్ ఎనర్జీ సోర్స్ సౌకర్యం, విద్యుత్ సరఫరా, డెడికేటెడ్ పవర్ సప్లై నెట్వర్క్, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్ వంటి అభ్యర్థనలు చేస్తున్నందున ఈ అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు పుడతాయని, అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని సీఎస్ పేర్కొన్నారు.
