
సముద్రఖని లీడ్ రోల్లో నటుడు ధనరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రామం రాఘవం’. గురు పూజోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘తెలిసిందా నేడు’ అనే పాటను విడుదల చేశారు. దర్శకుడు సుకుమార్ ఈ పాటను లాంచ్ చేశారు. తండ్రీకొడుకు మధ్య అనుబంధాన్ని చూపిస్తూ ఎమోషనల్గా సాగిన ఈ పాటను అరుణ్ చిలువేరు కంపోజ్ చేయగా శ్రీకాంత్ హరిహరణ్ పాడాడు.
‘తెలిసింద నేడు.. గమనించి చూడు.. నిను కన్న తోడు విలువేంటని.. నిశి నీడలోనూ.. నిను వీడిపోని ఒక నాన్న మనసు బరువెంతని..’ అని రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం మనసుకు హత్తుకునేలా సాగింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నారు. మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రలు పోషించారు.