పతంజలిపై ప్రభుత్వ విచారణ.. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

పతంజలిపై ప్రభుత్వ విచారణ.. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రామ్‌‌‌‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థ అనుమానాస్పద లావాదేవీల ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ నిధులను మళ్లించినట్టు, పాలనాపరమైన లోపాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. పన్నులు ఎగ్గొట్టారని, అక్రమంగా రిఫండ్లను పొందారంటూ వార్తలు వచ్చాయి. కేన్సర్​ వంటి ప్రమాదకర వ్యాధులను తమ ప్రొడక్టులు నయం చేస్తాయంటూ ఇచ్చిన ప్రకటనలను కోర్టులు తప్పుబట్టాయి. వీటన్నింటిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పతంజలి సంస్థ ఆర్థిక కార్యకలాపాలు, ముఖ్యంగా కొన్ని లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ వ్యవహారంపై లోతైన విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా, పతంజలి ఆర్థిక రికార్డులు, లావాదేవీల వివరాలు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా పతంజలి ఆయుర్వేద్ దేశంలో వేగంగా విస్తరించింది. ఆయుర్వేద ఉత్పత్తుల నుంచి ఎఫ్‌‌‌‌ఎంసీజీ రంగం వరకు అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విస్తరణ క్రమంలోనే కొన్ని ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ విచారణకు పతంజలి సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని, తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నట్లు సమాచారం.