- వేడుకలు చేస్తున్న రామ్రాజ్
హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ ధోతీని తన శాశ్వత వస్త్రధారణగా మార్చుకున్న చరిత్రాత్మక సంఘటనకు వందేళ్లు నిండిన సందర్భంగా తమిళనాడు టెక్స్టైల్ కంపెనీ రామ్రాజ్ కాటన్ ధోతీ శతాబ్ది వేడుకలను ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటంలో మరణించిన 100 మంది అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడమేగాక 100 మంది చేనేత కళాకారులను సన్మానిస్తారు. పర్యావరణ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా 100 మొక్కలు నాటుతారు. వేడుకల్లో భాగంగా చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ కళాకారులు ‘గాంధీ వాజియిల్ రామ్రాజ్’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల ప్రారంభం సందర్భంగా రామరాజ్ కాటన్ ఎండీ కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ మహాత్ముడి వస్త్రధారణ జాతికి స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. భారతీయులకు ఇదొక గుర్తింపు చిహ్నంగా మారిందని చెప్పారు. గత 40 ఏళ్లుగా చేనేత పరిశ్రమకు చేయూతను ఇస్తూ 40 వేల మంది చేనేత కార్మికులకు సాయపడుతున్నామని వివరించారు. అనంతరం ‘మహాత్మవై కొండదువొమ్’ అనే పుస్తకాన్ని కోయంబత్తూరులోని భారతీయ విద్యాభవన్ చైర్మన్ కృష్ణరాజ్ వనవరాయర్ ఆవిష్కరించారు. గాంధీ మహాత్ముడు 1921 సెప్టెంబరు 22న మదురై నగరానికి వచ్చారు. అక్కడి ప్రజలు చాలీచాలని బట్టలతో కనిపించడంతో తల్లడిల్లారు. ఇక నుంచి తాను జీవితాంతం ధోతీ మాత్రమే ధరిస్తానని ప్రకటించారు.