ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం

హైదరాబాద్, వెలుగు: ప్రేమపేరుతో యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్​స్పెక్టర్ ఆనంద్​కిషోర్​ వివరాల ప్రకారం… హైదరాబాద్​లోని యాకుత్ పురా సెగ్మంట్​ఈతేబార్​చౌక్​ బస్తీకి చెందిన యువతి(20)కి స్థానికంగా ఉండే సయ్యద్​హాజీ మస్తాన్​ తో పరిచయం ఏర్పడింది. తనను  ప్రేమిస్తుండడంతో యువతి అతనితో చనువుగా ఉండేది. ఇదే అదనుగా ఆమెను మాట్లాడదామంటూ పిలిచి మత్తుమందు కలిపిన చాక్లెట్ ఇచ్చాడు.

స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన ఆమెకు మాయమాటలు చెప్పి అక్కడినుంచి పంపించేశాడు. మస్తాన్​కు డబ్బులు అవసరమైనపుడల్లా ఏకాంత సమయంలో తీసిన ఫొటోలను యువతికి చూపించి బ్లాక్​మెయిల్​ చేసేవాడు. తాను విదేశాలకు వెళుతున్నానని, డబ్బులు కావాలనడంతో  బంగారు నగలు తెచ్చి ఇచ్చింది. ఇంకా కావాలని వేధించడంతో భరించలేక విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసింది. శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.