- మార్చిలో 3 నెలల రేషన్పంపిణీ
- ఒకే నెల గోధుమలు ఇచ్చిన పౌరసరఫరాల శాఖ
- మిగతా రెండు నెలలపై సప్పుడు చేయలే
- ఈ నెల చెప్పకుండా రేషన్షాపులకు గోధుమలు
హైదరాబాద్సిటీ, వెలుగు: లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా రేషన్షాపులకు పంపించిన గోధుమ నిల్వలు అక్కడే మగ్గిపోతున్నాయ్. ఎండాకాలంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలని గత మార్చి నెలలో ఒకేసారి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేశారు. గోధుమలు మాత్రం ఏప్రిల్ నెలది మాత్రమే ఇచ్చారు. 3 నెలల కోటాను ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు.
కానీ, ఏమైందో ఏమో కానీ, లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా మే నెలలో కోటాను డీలర్లకు పంపించేశారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి15వ తేదీ వరకు రేషన్సరుకులు పంపిణీ చేస్తుంటారు. ఇప్పటికే గడువు ముగియడం, మూడు నెలల సరుకులను ఇప్పటికే తీసుకున్న లబ్ధిదారులు మళ్లీ జూన్లోనే అనుకుని గమ్మున ఉన్నారు.
దీంతో గోధుమలు రేషన్షాపుల్లోనే మగ్గుతున్నాయ్. ఐదు రోజుల్లో జూన్నెల కూడా మొదలవుతుండడంతో మరో కోటా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, మే నెల కోటా గురించి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక రేషన్డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.
డీలర్ల వద్ద మూలుగుతున్న నిల్వలు
నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో నెలకు ఒక్కో కార్డుదారుకు 5 కిలోల చొప్పున గోధుమలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన అధికారులు రేషన్డీలర్ల కు పంపిణీ చేసిన 8లక్షల మెట్రిక్ టన్నులు అలాగే ఉన్నాయ్. సిటీలో రేషన్ పంపిణీపై ఉన్నతాధికారులు అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని డీలర్లు అంటున్నారు.
మళ్లీ మూడు నెలలా ?
వేసవి ప్రారంభంలో 3 నెలల బియ్యం ఇవ్వడంతో చాలా మంది లబ్ధిదారులు వాటిని నిల్వచేసుకోవడానికి ఇండ్లలో స్థలం లేదని , అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ బియ్యం వ్యాపారులకు చేరి అక్కడి నుంచి మిల్లర్లకు..అక్కడ రీసైకిల్చేసి బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం వర్షాకాలం అనే పేరుతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను కూడా జూలైలోనే ఇవ్వనున్నట్టు సమాచారం.
