Mass Jathara Box Office: రవితేజ 'మాస్ జాతర' తొలి రోజు కలెక్షన్స్ ఎంత?.. 'బాహుబలి ది ఎపిక్' దెబ్బ పడిందా?

Mass Jathara Box Office:  రవితేజ 'మాస్ జాతర' తొలి రోజు కలెక్షన్స్ ఎంత?.. 'బాహుబలి ది ఎపిక్' దెబ్బ పడిందా?

మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర' ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు శనివారం ( నవంబర్ 1న) రిలీజ్ అయింది. భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందననను అందుకుంటోంది.  థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాలో రవితేజ సరసన  శ్రీలీల నటించింది.ఈ మూవీని తొలుత అక్టోబర్ 31న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించినా.. 'బాహుబలి ది ఎపిక్' దెబ్బకి ప్రీమియర్స్ కే పరిమితమైంది.  

తొలి రోజు వసూళ్లు..

ప్రీమియర్ షోల నుంచి అభిమానులకు జాతర మొదలుపెట్టిన 'మాస్ జాతర' తొలిరోజు  వసూళ్లను మూవీ మేకర్స్ ప్రకటించారు. 'మాస్ జాతర'పై ఉన్న అంచనాలకు తగ్గట్టే, ప్రీమియర్ షోల వసూళ్లు రికార్డు సృష్టించిందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బి, సి సెంటర్లలో అభిమానుల అటెండెన్స్ అద్భుతంగా ఉందని సోషల్ మీడియా వేదికాగా తెలిపింది. రవితేజ మాస్ అప్పీల్ ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేస్తోందని పేర్కొంది. వీక్ డేస్ లో కలెక్షన్ల మరింత పెరగనున్నాయని ధీమా వ్యక్తం చేశారు మూవీ టీం.  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,  ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త సమర్పణలో, యువ దర్శకుడు భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 

 

కథాంశం.. 

కథ విషయానికి వస్తే, ఇది రవితేజకు బాగా అచ్చొచ్చిన ఖాకీ యాక్షన్  డ్రామా  ' మాస్ జాతర '.  ఇందులో లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక పవర్‌ఫుల్ రైల్వే పోలీసు అధికారి. తన పరిధి కాకపోయినా అన్యాయం జరిగితే సహించలేని మనస్తత్వం అతనిది. ఈ క్రమంలోనే వరంగల్‌లో ఓ కేసులో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అక్కడి నుంచి అల్లూరి జిల్లాలోని అడవివరం అనే మారుమూల ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అయితే ఆ ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) అనే గంజాయి స్మగ్లర్ కంట్రోల్‌లో ఉంటుంది. జిల్లా ఎస్పీ నుంచి రాజకీయనాయకుల అండదండలు ఉన్న శివుడికి ఉంటాయి. మరి ఆ శివుడు సామ్రాజ్యాన్ని, కేవలం రైల్వే ఎస్సై అయిన లక్ష్మణ్ భేరి ఎలా అడ్డుకున్నాడు? తులసి (శ్రీలీల) పాత్ర ఈ కథలో ఎలా కీలకంగా మారింది? అన్నదే అసలు కథ.

ఎవరెవరు ఎలా చేశారంటే?

రవితేజ నటన, ఎనర్జీ ఈ సినిమాకు ప్రధాన బలం. లక్ష్మణ్ భేరి పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఫ్యాన్స్ కోరుకునే విధంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్‌లు, హుషారైన స్టెప్పులతో తెరపై సందడి చేశారు. ఆయన వింటేజ్ స్టైల్, స్వాగ్ కొన్ని చోట్ల 'విక్రమార్కుడు', 'క్రాక్' సినిమాలను గుర్తు చేస్తాయి. శ్రీలీల మూడు కోణాల్లో సాగే తులసి పాత్రకు న్యాయం చేసింది, ముఖ్యంగా పాటల్లో రవితేజతో కలిసి వేసిన స్టెప్పులు మెప్పిస్తాయి. విలన్‌గా నవీన్ చంద్ర విలనిజం ఆరంభంలో ఆకట్టుకున్నా, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కాస్త బలహీనపడింది. హీరో తాతయ్యగా రాజేంద్ర ప్రసాద్‌ కామెడీతో పాటు, సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ సర్ప్రైజ్ చేస్తుంది.

రవితేజ.. మాస్ ఎలివేషన్స్‌

దర్శకుడు భాను భోగవరపు కథ-కథనంపై కాకుండా, కేవలం రవితేజ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరిచే మాస్ ఎలివేషన్స్‌, యాక్షన్ అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  రమితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు.  రైల్వే పోలీసు అధికారిగా లక్షణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయారని ..  యాక్షన్ సీన్లు అదరగొట్టేశారని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే  సినిమాను ఆసక్తికరమైన సన్నివేశంతో మొదలుపెట్టినా, కొంతసేపటికే కథనం రొటీన్‌గా మారుతుంది. పాత సినిమాల్లోని సంఘర్షణే మళ్లీ చూపించినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కొన్ని కామెడీ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌ పర్వాలేదు. కానీ, సెకండాఫ్‌లో లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ బలహీనంగా మారాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..

 'మాస్ జాతర' అనేది రవితేజ అభిమానుల కోసం రూపొందించిన పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రొటీన్ కథ-కథనాన్ని పక్కన పెడితే, రవితేజ ఎనర్జీ, మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పండగలా అనిపిస్తాయి. కానీ, కొత్తదనం ఆశించే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఇప్పటికే చాలాసార్లు చూసిన 'ఖాకీ కథ' లాగే అనిపిస్తుంది. మొత్తానికి ఈమూవీ రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు పండగలాంటి సినిమా అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూడాలి.