గచ్చిబౌలి, వెలుగు: ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. పటాన్ చెరువు లోని శ్రీరాంనగర్కు చెందిన రావుల రవికుమార్ (43) స్థానికంగా ది బెస్ట్ ఫర్నీషింగ్ షాప్లో సేల్స్ మెన్. ఆన్ లైన్ యాప్స్లో, తెలిసిన వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని గేమ్స్ ఆడాడు. డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారు, లోన్ యాప్ వారు కాల్స్ చేసి డబ్బులు కట్టాలని వేధిస్తుండగా మానసికంగా కుంగిపోయాడు. దీంతో కాల్స్ లిఫ్ట్ చేయకుండా, ఇంట్లో ఎవరితో కూడా మాట్లాడకుండా ఉంటున్నాడు.
గమనించిన రవికుమార్ భార్య, సోదరుడు అప్పులు తాము చెల్లిస్తామని చెప్పినా వినకుండా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం సమయంలో తను పని చేసే షాపులోనే ఉరేసుకుని చనిపోయాడు. చందానగర్ పోలీసులు డెడ్బాడీని పోస్టుమారం కోసం తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నగేశ్ తెలిపారు.