MCHRDలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

MCHRDలో క్యాంప్ ఆఫీస్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ భవనాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామని, కొత్తవి కట్టబోమమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాటినే పార్లమెంటు తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో ఖాళీగా ఉన్న భవనాన్ని మరో మంత్రికి కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఎంసీహెచ్ ఆర్డీ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు 12 నుంచి 14 గంటల కరెంటు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించిన తర్వాత సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు. రేపు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నామని, శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

పాత అసెంబ్లీ భవనంలో శాసన మండలి సమావేశాలు. ఇప్పుడున్న అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు జరుగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో మార్గం విస్తరణతో పెద్దగా ఉపయోగం ఉండబోదని సీఎం అభిప్రాయపడ్డారు. మరో రూట్ లో మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు  సిద్ధం చేస్తామని రేవంత్  రెడ్డి వెల్లడించారు.