సొంత దేశం కంటే ఐపీఎలే ముఖ్యమా.. జోష్ హాజిల్‌వుడ్‎పై జాన్సన్ విమర్శలు..!

సొంత దేశం కంటే ఐపీఎలే ముఖ్యమా.. జోష్ హాజిల్‌వుడ్‎పై జాన్సన్ విమర్శలు..!

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హాజిల్ వుడ్‎పై ఆ దేశ మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ విమర్శలు గుప్పించాడు. సొంత దేశం కంటే ఐపీఎల్‎కు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని నిలదీశారు. హాజిల్‎వుడ్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కాగా, ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆలస్యంగా ముగిసిన విషయం తెలిసిందే. టోర్నీ ఆలస్యం కావడంతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం కారణంగా చాలా మంది ఆటగాళ్లు లీగ్ మధ్యలోనే సొంత దేశాలకు వెళ్లారు. 

ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ తరుఫున ఆడుతోన్న ఆసీస్ స్టార్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ ఉండగా.. జూన్ 11న డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. ఈ రెండు ఫైనల్ మ్యాచులకు మధ్య కేవలం వారం మాత్రమే గ్యాప్ ఉండటంతో జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా హాజిల్‎వుడ్ ఐపీఎల్ ఫైనల్‎కు అందుబాటులో ఉండడని ప్రచారం జరిగింది. కానీ అనుహ్యంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం హాజిల్ వుడ్ ఇండియాకు తిరిగొచ్చాడు. 

ఫైనల్‎ల్లో ఆర్సీబీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ తొలి ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన హాజిల్ వుడ్‎పై బెంగుళూర్ ఫ్యాన్స్ ప్రశంసలు వర్షం కురిపించారు. కానీ జూన్ 11 నుంచి సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‎లో హాజిల్ వుడ్ అంచనాల మేర రాణించలేదు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి నిరాశపర్చాడు. దీంతో హాజిల్ వుడ్‎పై సొంతదేశంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

ఐపీఎల్ కోసం హాజిల్ వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్‎కు సరిగా సన్నద్ధం కాలేదని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాజిల్ వుడ్‎పై మిచెల్ జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సొంత దేశం కంటే ఐపీఎలే ముఖ్యమా..? డబ్ల్యూటీసీ వరల్డ్ కప్‎కు సరిగ్గా వారం రోజుల వ్యవధి కూడా లేని సమయంలో ఐపీఎల్ కోసం ఇండియా వెళ్లాలన్న హాజిల్ వుడ్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 

‘‘ఇటీవలి సంవత్సరాలలో హేజిల్‌వుడ్ ఫిట్‌నెస్ గురించి మేము ఆందోళనలను చూశాం. అతను జాతీయ జట్టు సన్నాహాల కంటే ఆలస్యమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి తిరిగి వెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాలనే అతని నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అన్నాడు జాన్సన్. అలాగే  ఆటగాళ్ల రిటైర్మెంట్ పైన జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎంత గొప్ప ఆటగాడైనా ఏదో ఒక రోజు రిటైర్మెంట్ కాక తప్పదని.. సీనియర్ ఆటగాళ్లు తమ తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆట నుంచి వైదొలగాలన్నారు. అంతేకానీ యాషెస్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆటకు ముగింపు పలుకుతామనుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఇలా చేస్తే యువ ఆటగాళ్లకు అవకాశాలు రాక అన్యాయం జరుగుతోందన్నారు.