వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఈ నెల 15న దసరా సందర్భంగా.. దిష్టి బొమ్మలు దహనం చేస్తామన్నారు. 18న ఆరు గంటల పాటు రైల్ రోకో చేపడతామని అన్నారు. 26న దేశవ్యాప్తంగా కలశ యాత్రలు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టబోయే నిరసనలపై ఆయన ఢిల్లీలో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లఖీంపూర్ నిరసనల్లో జరిగిన అల్లర్లపై స్పందించారు. ‘‘యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతులపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్ర ఆగ్రహానికి గురై తిరబడ్డారు. ఈ క్రమంలో జరిగిన కొట్లాటలో లఖీంపూర్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మరణించారు. దీనికి కారణమైన వాళ్లు తప్పు చేశారని నేను భావించడం లేదు” తికాయత్ అన్నారు.
గత ఆదివారం యూపీలోని లఖీంపూర్లో రైతులు నిరసనలు తెలుపుతుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతుల మరణించారు. దీంతో రైతులు కాన్వాయ్ను అడ్డుకుని ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. పరస్పరం కొట్లాట జరగడంతో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, అజయ్ మిశ్రా కాన్వాయ్లోని వెహికల్ డ్రైవర్, ఒక రిపోర్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యూపీ పోలీసులు సిట్ను నియమించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో రైతులను గుద్దించిన కారులో అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా ఉన్నారని, అన్ని ఆధారాలు ఉన్నా పోలీసులు ఇంకా అరెస్టు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.
