బిజినెస్డెస్క్, వెలుగు: దేశంలోని టాప్ బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో ఇండ్ల అమ్మకాలు పండగ సీజన్లో మరింత పెరుగుతాయని రియల్ ఎస్టేట్ సెక్టార్ ఆశిస్తోంది. స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), కోటక్ మహీంద్రా బ్యాంకులు తమ హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఇతర పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా హోమ్లోన్లపై వడ్డీ రేట్లను పండగ సీజన్ కోసం తగ్గిస్తాయని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేస్తాయని భావిస్తోంది. స్టేట్ బ్యాంక్ పండగ సీజన్ కోసం రెండు దశల్లో హోమ్లోన్లపై ఆఫర్లను ప్రకటించింది. మొదటి ఫేజ్ సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఉండగా, రెండో ఫేజ్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుందని ఎస్బీఐ ప్రకటించింది. ఎంత లోన్ అమౌంట్ అయినా వడ్డీ రేటు 6.70 శాతం నుంచే ఉంటుందని బ్యాంక్ ప్రకటించింది. ముందు రూ. 75 లక్షల కంటే ఎక్కువ హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లపై 7.15 శాతం నుంచి వడ్డీ పడేది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పండగ సీజన్ కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. రూ. 50 లక్షల కంటే ఎక్కువ తీసుకునే హోమ్లోన్పై వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించి 6.60 శాతానికి తెచ్చింది. వీటికి అదనంగా హోమ్లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, పెన్షన్ లోన్, ప్రాపర్టీ లోన్, గోల్డ్ లోన్లపై ప్రాసెసింగ్ ఛార్జీలను తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్పై వడ్డీ రేటు 6.75 శాతం నుంచి స్టార్టవుతోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్లోన్లపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించి 6.50 శాతానికి తెచ్చింది. పండగ సీజన్ కోసం మాత్రమే వడ్డీ రేట్లను తగ్గించామని ఈ బ్యాంకు ప్రకటించింది. ఇలా టాప్ బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఆనందపడుతోంది.
సరైన టైమ్లో తీసుకున్న నిర్ణయం..
ఈ పండగ సీజన్లో హౌసింగ్ సెక్టార్లో డిమాండ్ పెరుగుతుందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. బ్యాంకులు హోమ్లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేయడం, ఆక్యుపేషన్ లింక్డ్ వడ్డీ ప్రీమియం (జాబ్ బట్టి వడ్డీ ఎక్కువగా ఉండడం) వంటివి రద్దు చేయడంతో కస్టమర్లు అదనంగా పొదుపు చేసుకోవచ్చన్నారు. ఎస్బీఐను ఇతర బ్యాంకులు కూడా ఫాలో అవుతాయని అంచనా వేశారు. ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ మరింత పెరుగుతుందని హౌసింగ్ డాట్ కామ్ సీఎఫ్ఓ వికాస్ వాధావన్ అన్నారు. ఇప్పటికే ఇండ్ల ధరలు తక్కువగా ఉన్నాయని, బయ్యర్లు ఇంకొంత సేవ్ చేసుకోవడానికి వీలుంటుందని చెప్పారు. దేశంలోని లీడింగ్ బ్యాంకులు హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తుండడంతో ఇండ్లను కొనాలనుకునేవారు తొందరగా నిర్ణయం తీసుకుంటారని సోత్బే ఇంటర్నేషనల్ రియల్టీ సీఈఓ అమిత్ గోయల్ అన్నారు. లోన్ అమౌంట్తో సంబంధం లేకుండా వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించడంతో లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ కూడా ప్రయోజనం పొందుతుందని పేర్కొన్నారు. కాగా, దేశంలోని కన్జూమర్లు పండగ సీజన్లో ఎక్కువగా ఇండ్లను కొనుగోలు చేస్తుంటారు. బ్యాంకులు సరైన టైమ్లో హోమ్లోన్లపై ఆఫర్లను ప్రకటిస్తున్నాయని రియల్టీ సెక్టార్ వర్గాలు చెబుతున్నాయి. బిజీగా ఉండే ఫెస్టివ్ సీజన్లో హోమ్లోన్లపై బ్యాంకులు ఆఫర్లు ప్రకటిస్తుండడంతో హౌసింగ్ సేల్స్ మరింత ఊపందుకుంటాయని పేర్కొంటున్నాయి. ‘హౌసింగ్ మార్కెట్ ఇప్పటికే అప్ట్రెండ్లో ఉంది. తాజాగా ఎస్బీఐ తీసుకున్న నిర్ణయంతో సేల్స్ మరింత పెరుగుతాయి’ అని సిగ్నేచర్ గ్లోబల్ ఫౌండర్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. అఫోర్డబుల్, మిడ్ సెగ్మెంట్ హౌస్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని రహేజా డెవలపర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నయన్ రహేజా అన్నారు. ఇప్పటికే డెవలపర్లు ఇండ్ల రేట్లను తగ్గించారని, బ్యాంకులు కూడా హోమ్లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో బయ్యర్లు రెండు విధాలుగా ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ఏడు ప్రధాన సిటీలలో ఇండ్ల అమ్మకాలు 1.8 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని తాజాగా అనరాక్ రిపోర్ట్ పేర్కొంది. కానీ, డిమాండ్ ఇంకా కరోనా ముందు స్థాయిల కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, మెట్రోపాలిటన్ రీజియన్ , పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా సిటీలలో 2019 లో 2,61,358 ఇండ్లు అమ్ముడయ్యాయి.