
సబ్బండ వర్గాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పుష్కర కాలంలోకి అడుగుపెడుతోంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా ఒకసారి గత చరిత్రను తిరగేస్తే తెలంగాణకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న అవినాభావ బంధం స్పష్టమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటపై నిలబడి ఉండాలనే దృఢమైన సంకల్పంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, కలలను సాకారం చేశారు.
రాష్ట్రం ఏర్పాటై పదకొండేళ్లు పూర్తయి పన్నెండో ఏట ప్రవేశిస్తున్నవేళ తెలంగాణలో వచ్చిన గణనీయమైన మార్పులను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రజల ఆదరణతో కాంగ్రెస్ అంటే తెలంగాణ అనేలా రాష్ట్రంలో వాతావరణం ఏర్పడిందన్నది కాదనలేని సత్యం.
కాంగ్రెస్ లేకుండా తెలంగాణ గురించి మాట్లాడడం అసాధ్యం. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న తెలంగాణ ఉద్యమంపై పూర్తి అవగాహన ఉన్న సోనియా గాంధీ 2004లో కరీంనగర్ బహిరంగ సభలో తెలంగాణపై ప్రకటన చేయడం కీలక పరిణామం. అధికారంలోకి వచ్చాక మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను తెలంగాణ కోసం ఒప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకొని 2009 డిసెంబర్ లో తెలంగాణ ఏర్పాటుపై అధికారికంగా ప్రభుత్వంచే ప్రకటన చేయించడం ఒక మైలురాయి.
రాష్ట్ర ఏర్పాటు తుది దశలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సొంత ఎజెండాతో చికాకులు కలిగించినా ఏమాత్రం చలించక సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అన్నీ తానై వ్యవహరించడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత కేసీఆర్ తన కపట నాటకాలకు తెరతీశారు. రాష్ట్ర సాధన తనతోనే సాధ్యమైంది అనేలా ప్రజలను నమ్మించి సెంటిమెంట్ పేరుతో అధికారంలోకి వచ్చారు.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని నమ్మబలికి వారిని వంచించి ఆయనే సీఎం పీఠం ఎక్కారు. ఉద్యమంలో పాలుపంచుకున్న మేధావులను, కళాకారులను, విద్యార్థులను, కార్మికులను ఇలా అన్ని వర్గాలవారిని అధికారంలోకి వచ్చేవరకు వాడుకొని అనంతరం అవమానించారు. 2014, 2018 ఎన్నికల్లో సెంటిమెంట్తో పగ్గాలు చేపట్టిన కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆకాంక్షలు కలలుగానే మిగిలిపోవడంతో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడారు.
తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్, ఇచ్చింది సోనియమ్మ అని గట్టిగా నమ్మిన రాష్ట్ర ప్రజలు 2023లో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షలు సఫలమవుతున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కానరాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రజా పాలనతో కార్యరూపం దాలుస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన రాష్ట్ర ఆవిర్భావం నాటికి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులమయంగా చేసినా, చెప్పిన మాటకు కట్టుబడే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. మహిళలకు సాధికారత కల్పిస్తూ, రైతన్నలకు పెద్దపీట వేస్తూ, యువతలో భరోసా కల్పిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తూ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అందరి మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోంది.
ఇందిరమ్మ రాజ్యం - ఇంటింటా సౌభాగ్యం హామీకి కట్టుబడిన కాంగ్రెస్ తెలంగాణలో మహిళా సాధికారితకు పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మహాలక్ష్మి పథకాలను ప్రారంభించింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో సగటున రోజుకు 35 లక్షల మంది ఆడబిడ్డలకు లబ్ధి కలుగుతోంది.
మహిళల పేరిట ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో 50 లక్షలకుపైగా కుటుంబాలకు, రూ.500 గ్యాస్ సబ్సిడీతో 40 లక్షలకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఆరోగ్యశ్రీ బీమాను రూ.10 లక్షలకు పెంచడంతో పేదల్లో ఆరోగ్య భద్రత ఏర్పడింది. మహిళల పేరిట 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, 40 లక్షలకు పైగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది.
రైతు కుటుంబాల్లో ఆనందం
ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని కోటిమంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బృహత్కరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. రైతుల సంతోషంతోనే సమాజం సస్యశ్యామలంగా ఉంటుందని విశ్వసించే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు రూ.21 వేల కోట్లకుపైగా రుణమాఫీ చేయడంతో 25 లక్షలకుపైగా రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
గతంలో బీఆర్ఎస్ రైతుబంధు కింద పదివేల రూపాయలు ఇవ్వగా, ఇప్పుడు కాంగ్రెస్ రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తుండడంతో అన్నదాతలకు పెట్టుబడిగా మారాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం వరి సాగు దండగ అంటే, కాంగ్రెస్ రూ.500 బోనస్ ఇవ్వడంతో రాష్ట్రంలో సన్న బియ్యం ఉత్పత్తి పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో తెలంగాణ రికార్డు స్థాయిలో 275 లక్షల టన్నుల ధాన్యాన్ని దిగుబడి చేసి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ‘ధరణి పోర్టల్’తో రైతులతో సహా అనేకమంది ఇబ్బందులుపడ్డారు. అవినీతికి అడ్డుకట్టువేసి, భూ యజమానులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ లోతైన అధ్యయనం చేసి ‘భూ భారతి’ తీసుకురావడంతో ప్రజల్లో భరోసా నింపింది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు
గతంలో రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం 23 శాతానికి తగ్గించి ఆ సామాజికవర్గం రాజకీయ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారడంలో ఆలస్యమైనా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లిచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడింది.
మరోవైపు బీజేపీ కూడా తెలంగాణపై పదకొండేళ్లుగా సవతి తల్లి ప్రేమచూపిస్తూ అడుగడుగునా అన్యాయం చేస్తోంది. రాష్ట్ర విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలను, ప్రాజెక్టులను, నిధులను, కేంద్ర విద్యాసంస్థలను, రైల్వే కర్మాగారాలను మంజూరు చేయడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీని,కేంద్ర మంత్రులను పలుమార్లు స్వయంగా కలిసి విన్నవించినా కేంద్ర ప్రభుత్వం తీరులో మార్పురావడం లేదు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలున్నా వారు రాష్ట్ర హక్కుల కోసం ప్రయత్నించకపోవడం అటుంచి ప్రతి అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తుందని ప్రజలు భరోసాతో ఉన్నారు. రాష్ట్రం ఇచ్చి సబ్బండ వర్గాల ఆకాంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్య పాలన చేస్తూ ‘రైజింగ్ తెలంగాణ’తో ప్రజల కలలను సాకారం చేస్తోంది.
60వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు
ఇంటింటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తన కుటుంబ సభ్యులకు రాజకీయ పదవులు ఇచ్చుకున్నారు కానీ యువతను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాస్’ ద్వారా 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేసే ప్రక్రియ ప్రారంభించింది.
రాష్ట్రంలో అధికంగా పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు స్థాపించేలా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తుండడంతో దావోస్ వేదికగా తెలంగాణకు భారీ పెట్టుబడులు వచ్చాయి. శాస్త్రీయబద్ధంగా కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తిచేసి దేశానికే స్ఫూర్తిగా నిలబడింది. తెలంగాణ ప్రభుత్వం. బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో రికార్డు సృష్టించిన తెలంగాణ కీర్తిపతాకం జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోంది.
యూపీఏ కూటమిలో, కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా మిశ్రమ స్పందనలు రావడంతో రాజకీయంగా పార్టీకి కొంతనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిసినా.. ఏమాత్రం బెదరక సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ చారిత్రాత్మకమైన ఘటన ఆవిష్కారమైంది.
-బి.మహేశ్ కుమార్ గౌడ్,ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు