- విజేతలకు బహుమతులు అందజేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
గండిపేట, వెలుగు: హెచ్సీఎల్ గ్రూప్ ఆధ్వర్యంలో హెచ్సీఎల్ సైక్లోథాన్ హైదరాబాద్ 2025 కార్యక్రమం ఆదివారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) పర్యవేక్షణలో నిర్వఈహించిన ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 1,900 మందికి పైగా ప్రొఫెషనల్, అమెచ్యూర్ సైక్లిస్టులు, ఫిట్నెస్ ప్రియులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ రేస్ ప్రైమ్ అరేనా, ఉస్మాన్నగర్, వట్టినాగులపల్లి వద్ద ప్రారంభమై అదే ప్రదేశంలో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హాజరయ్యారు. రూ.33.6 లక్షల రివార్డు కోసం సైక్లిస్టులు వివిధ విభాగాల్లో పోటీపడ్డారు. ఈ కార్యక్రమం ఇండియాలోనే అగ్రశ్రేణి సైక్లింగ్ పోటీగా మరోసారి నిలిచింది.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడుతూ.. హెచ్సీఎల్ సైక్లోథాన్ వంటి ఈవెంట్లు ఫిట్నెస్, సస్టైనబిలిటీ, కమ్యూనిటీ వెల్బీయింగ్ల పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. ఇది ఆరోగ్యవంతమైన పచ్చని భారతదేశం వైపు ఒక పెద్ద అడుగు అని అన్నారు. హెచ్సీఎల్ గ్రూప్ ప్రెసిడెంట్(స్ట్రాటజీ) సుందర్ మహాలింగం మాట్లాడుతూ.. హైదరాబాద్లో హెచ్సీఎల్ సైక్లోథాన్ రెండవ ఎడిషన్ విజయవంతంగా ముగియడం గర్వకారణమని పేర్కొన్నారు. సైక్లింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారిందని చెప్పారు. క్రీడా కార్యక్రమంగా మొదలైన ఈ ప్రోగ్రాం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,600 మందికి పైగా రైడర్లను కలిపే కమ్యూనిటీగా ఎదిగిందని తెలిపారు. ప్రొఫెసనల్ రోడ్ రేస్ 48 కిలోమీటర్లు (పురుషులు) హర్షవీర్ సింగ్ సెకోన్ (పంజాబ్), నవీన్ జాన్ (కర్నాటక), సూర్యతాతు(మహారాష్ట్ర), మహిళల విభాగంలో పూజా బబన్ డనోల్(మహారాష్ట్ర), స్వాతిసింగ్(ఒడిశా), హర్షితా జాఖా(రాజస్తాన్) విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇడియా ప్రధాన కార్యదర్శి మనిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
