ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ వెల్లడి

హైదరాబాద్: వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియను ఈనెల 23 తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్  ప్రారంభించిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ను లాంచ్ చేస్తారని సీఎం తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ….‘‘ ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది… అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నదన్నారు. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.

ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని.. నిశ్చింతను వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది… ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది…  మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరు శాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది.,, ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నా… అందుకే కొన్ని రోజులు వేచి చూశాము… నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు  అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్నా ’’ అని సీఎం అన్నారు.