రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) లాభాలు ఈ ఏడాది జూన్తో ముగిసిన తొలి క్వార్టర్లో 6.82 శాతం (వార్షికంగా) పెరిగి రూ.10,104 కోట్లుగా నమోదయ్యాయి. ఈ లాభాలు దలాల్స్ట్రీట్ అంచనాలకు మించిపోవడం విశేషం. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్కు రూ.9,550 కోట్ల నికర లాభాలే వస్తాయని భావించారు. వారి అంచనాలను మించి లాభాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రిలయన్స్కు రూ.9,459 కోట్ల నికర లాభాలు వచ్చాయి. రిలయన్స్కు చెందిన టెలికాం యూనిట్ జియోకు ఏఆర్పీయూ తగ్గినప్పటికీ… లాభాల వృద్ధి మాత్రం బాగా పెరిగింది. జియో ఏడాది కాలంలో 45.60 శాతం వృద్ధి సాధించి, రూ.891 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం రెవెన్యూ కూడా ఈ క్వార్టర్లో కన్సాలిడేటెడ్గా 22.1 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లుగా రికార్డయింది. జూన్ క్వార్టర్లో గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్ బ్యారల్కు 8.1 డాలర్లుగా రికార్డయింది. గ్రూప్ మొత్తం మీద ఒక్కో షేరుపై ఆర్జించే బేసిక్ ఎర్నింగ్స్ రూ.17.1కు పెరిగాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ ఎర్నింగ్స్ రూ.16గా ఉండేవి. ఔట్స్టాండింగ్ డెట్ ఈ క్యూ1లో రూ.2,88,243 కోట్లుగా ఉంది. 2019 జూన్ 30తో ముగిసిన క్వార్టర్ నాటికి నగదు, క్యాష్ ఈక్వలెంట్స్, మార్కెటేబుల్ సెక్యురిటీస్ రూ.1,31,710 కోట్లకు తగ్గాయి. గతేడాది ఇవి రూ.1,33,027 కోట్లుగా రికార్డయ్యాయి. టెలికం విభాగం ‘జియో’ ఆపరేటింగ్ రెవెన్యూ వార్షికంగా 44 శాతం, క్వార్టర్ పరంగా 5.20 శాతం పెరిగి రూ.11,679 కోట్లకు చేరింది. రిటైల్ సెగ్మెంట్ భారీ రెవెన్యూలను అందించింది. సేల్స్ 47.5 శాతం పెరిగి రూ.38,196 కోట్లుగా రికార్డయ్యాయి. ఈ సెగ్మెంట్లో ఈబీఐటీడీఏ 69.9 శాతం పెరిగింది. గతేడాది రూ.1,206 కోట్లుగా రికార్డైన ఈబీఐటీడీఏ.. ఈ క్వార్టర్లో రూ.2,049 కోట్లకు జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ పెట్రోకెమికల్ ఈబీఐటీ ఈ క్వార్టర్లో రూ.7,508 కోట్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్ నుంచి వచ్చిన రెవెన్యూ 6.4 శాతం పెరిగి రూ.1,01,721 కోట్లుగా ఉంది. అదేవిధంగా ఈబీఐటీ 15.2 శాతం తగ్గి రూ.4,508 కోట్లుగా నమోదైనట్టు చెప్పింది. పెట్రోకెమికల్స్ సెగ్మెంట్ నుంచి వచ్చిన రెవెన్యూలు 6.6 శాతం తగ్గి రూ.37,611 కోట్లకు పడిపోయాయి. ఆయిల్, గ్యాస్ సెగ్మెంట్ నుంచి కూడా రెవెన్యూలు 35.5 శాతం తగ్గి రూ.923 కోట్లకు చేరాయి.
జియో..నెం.2 టెల్కో
జియో ఎయిర్టెల్ను అధిగమించి రెండో అతిపెద్ద ఆపరేటర్గా నిలిచిందని ట్రాయ్ తెలిపింది. ఈ ఏడాది మే చివరి నాటికి జియో యూజర్లు 32.29 కోట్ల మంది ఉన్నారు. అదే ఎయిర్టెల్ విషయానికొస్తే 32.03 కోట్ల యూజర్లే ఉన్నట్టు తెలిసింది. వొడాఫోన్ ఐడియా అగ్రస్థానంలో ఉంది.