ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో బ్రాడ్బ్యాండ్ ‘గిగాఫైబర్’ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో గురువారం నుంచి ప్రారంభించినట్టు రిలయన్స్ ప్రకటించింది. రూ.699 నుంచి రూ.8,500 వరకు మొత్తం ఆరు నెలవారీ ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్ను బట్టి ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ డేటా, ఉచిత వాయిస్ కాలింగ్, డీటీహెచ్, గేమింగ్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్లు అదనం. ఏడాది ప్లాన్ తీసుకుంటే ఉచితంగా సెట్టాప్ బాక్స్ ఇస్తారు. రూ.1,299, అంతకంటే ఎక్కువ ప్లాన్ను రెండేళ్లకు తీసుకుంటే ఎల్ఈడీ టీవీ ఉచితంగా ఇస్తారు. 3,6,12 నెలల ప్లాన్స్ను కూడా అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల వాళ్లు బ్రాడ్బ్యాండ్ సేవల కోసం జియో డాట్ కామ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. కొన్ని ప్లాన్లకు ఉచితంగా బ్లూటూత్ స్పీకర్స్తోపాటు అమెజాన్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. జియో గిగాఫైబర్ పేరుతో రిలయన్స్ టెలికం కంపెనీ జియో తీసుకువస్తున్న బ్రాడ్బ్యాండ్ సర్వీసును సెప్టెంబరు ఐదో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు కంపెనీ గత నెల ప్రకటించడం తెలిసిందే. జియో గిగాఫైబర్ను ఇది వరకే దేశవ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్లలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. -దేశవ్యాప్తంగా 1,600 పట్టణాల్లోని రెండు కోట్ల ఇళ్లకు, 1.5 కోట్ల వ్యాపార సంస్థలకు జియో గిగాఫైబర్ సేవలు అందించడం లక్ష్యమని కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారి ఒకరు మాట్లాడుతూ 1జీబీపీఎస్ ప్లాన్, వీడియో కాన్ఫరెన్సింగ్, ఓటీటీ యాప్స్, గేమింగ్, హోమ్ నెట్వర్కింగ్, డివైజ్ సెక్యూరిటీ, వీఆర్, ప్రీమియం కంటెంట్ ప్లాట్ఫామ్ సేవలను ఇంకా మొదలుపెట్టలేదని అన్నారు. ప్రస్తుతానికి డేటా సేవలను అందిస్తున్నామని చెప్పారు. సెక్యూరిటీ డిపాజిట్, ఇన్స్టలేషన్ కోసం రూ.2,500 చెల్లించాలన్నారు. వెల్కమ్ ఆఫర్ కింద రూ.6,500 సెట్టాప్ బాక్స్ను ఉచితంగా ఇస్తామన్నారు.