రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా రూ.6 వేల కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా రూ.6 వేల కోట్ల పెట్టుబడి
  • ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం 
  • కంపెనీ ఏర్పాటుతో సోలార్‌‌‌‌ పరికరాల తయారీ హబ్‌‌గా
  • ఎలక్ట్రానిక్స్‌‌ ఇండస్ట్రీకి సమగ్ర పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్ భారీ పెట్టుబడి పెట్టనుంది. సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కర్నాటక, మహారాష్ట్రలో ఆ సంస్థకు ఉన్న యూనిట్ల కంటే పెద్ద యూనిట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో నిర్మించబో తున్నారని తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా హైదరాబాద్ సోలార్ పరికరాల తయారీకి హబ్‌‌‌‌గా మారుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహిస్తుందని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తామని తెలిపారు. ఇందుకోసం సమగ్ర ఇంధన పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. 

భూమి పూజలో పాల్గొన్న మంత్రి..

హైదరాబాద్‌‌‌‌లోని టీఎస్ఐఐసీ ఎరో స్పేస్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న వెపన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ పరిశ్రమ వల్ల రానున్న మూడేళ్లలో దాదాపు 400 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఎరో స్పేస్, డిఫెన్స్.. కోర్ రంగాలుగా ఉన్నాయని, ఇందులో అనేక ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, సాఫ్రాన్, జీఈ ఏవియేషన్ వంటి సంస్థలకు హైదరాబాద్ నిలయంగా మారిందన్నారు.