
యాదాద్రి, వెలుగు : ‘సర్కారు దగ్గర పైసలకు కొంత ఇబ్బందయితుంది. వచ్చిన కాడికి తీసుకోండి’ అని తనను కలిసిన బస్వాపురం నిర్వాసితులతో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ కారణంగా బీఎన్ తిమ్మాపురం పూర్తిగా మునిగిపోతోంది. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగడంతో పాటు మంత్రి హరీశ్రావు, సీఎస్ శాంతకుమారిని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో భువనగిరి ఎమ్మెల్యేను హైదరాబాద్లోని ఆయన నివాసంలో బస్వాపురం నిర్వాసితులు కలిశారు. తాము పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. దీంతో పరిహారం గురించి తాను సీఎం కేసీఆర్తో మాట్లాడానని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. గతంలో వచ్చిన రూ. 50 కోట్లను నిర్వాసితులకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ..ఇప్పుడు పైసలకు కొంత ఇబ్బందిగా ఉందన్నారు. త్వరలో మరికొన్ని డబ్బులు వస్తాయని చెప్పారు. దీని గురించి సీఎం కేసీఆర్ను బుధవారం మళ్లీ కలుస్తున్నానని చెప్పారు. కాగా పరిహారం కోసం నిర్వాసితులు 57వ రోజైన మంగళవారం బస్వాపురం రిజర్వాయర్ కట్టపై ఆందోళన చేశారు.
భూ సేకరణకు నోటీసులు జారీ - తిరస్కరించిన గ్రామస్థులు
బస్వాపురం రిజర్వాయర్ భూ సేకరణ కోసం జారీ చేసిన నోటీసులను యాదాద్రి జిల్లా బీఎన్ తిమ్మాపురం గ్రామస్థులు తిరస్కరించారు. ఇప్పటివరకూ 1,745 ఎకరాల అగ్రికల్చర్ భూములనే సేకరించిన ఆఫీసర్లు.. ప్రస్తుతం గ్రామానికి సంబంధించిన భూమిని సేకరించేందుకు అవార్డు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా 860 కుటుంబాలకు భువనగిరి ఆర్డీవో ఎంవీ భూపాల్రెడ్డి నోటీసులిచ్చారు. ఈ నోటీసుల్లో ప్రతి ఇంటి వైశాల్యంతో పాటు ఖాళీ స్థలం, అక్కడి చెట్లు, పశువుల వివరాలను పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన ఆర్ఐ భద్రయ్య, వీఆర్ఏ నవనీత ఈ నోటీసులను తీసుకోవాలని గ్రామస్థులను కోరగా వారు తిరస్కరించారు. గతంలో సేకరించిన భూములకే ఇప్పటివరకూ పరిహారం ఇవ్వలేదని, ఇప్పుడు నోటీసులు జారీ చేయడమేమిటని ఉడుత ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రావుల అనురాధ, గ్రామస్థులు ప్రశ్నించారు. దీంతో రెవెన్యూ స్టాఫ్ వెనుదిరిగి పోయారు.