డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో.. వసతులు కరువు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో.. వసతులు కరువు
  • సౌలత్​లు కల్పించకుండానే ఇండ్ల పంపిణీ
  •  అస్తవ్యస్తంగా విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ
  •  అసంపూర్తి పనులతో అవస్థలు.. పట్టించుకోని అధికారులు 
  •  మహబూబ్​నగర్​ జిల్లా మాచన్‌‌‌‌‌‌‌‌పల్లి లబ్ధిదారుల కష్టాలు

మహబూబ్​నగర్​/మహబూబ్​నగర్​ రూరల్​, వెలుగు  : కనీస సౌకర్యాలు కల్పించకుండా డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లను పంపిణీ చేయడంతో అక్కడ నివాసముంటున్న కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. మహబూబ్​నగర్​ రూరల్​ మండలం మాచన్​పల్లి గ్రామానికి బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు మంజూరయ్యాయి. మొత్తం ఎనిమిది బ్లాకుల్లో జీ ప్లస్​ వన్​ బిల్డింగులు నిర్మించారు. 

ఒక్కో బిల్డింగులో నాలుగు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల చొప్పున మొత్తం 32 ఇండ్లను నిర్మించారు. 2023లో వీటిని లబ్ధిదారులకు అలాట్​ చేయాల్సి ఉండగా, అర్హులను గుర్తించడంలో ఆలస్యం చేయడం, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంపిణీ వాయిదా పడింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక గత దీపావళి పండుగకు ముందు 32 మంది లబ్ధిదారులకు గుర్తించి, వారికి ఇండ్లను అలాట్​ చేసింది. 

ప్రస్తుతం ఈ 32 కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. అయితే డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు నిర్మించినా కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకోవడంతో ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి తిప్పలు తప్పడం లేదు. 

సమస్యలు ఇవీ..

  • డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లల్లో అటాచ్డ్​ బాత్​ రూమ్​, లెట్రిన్​లను నిర్మించారు. కుళాయిలు కూడా ఫిట్​ చేశారు. కానీ నీటి వసతి కల్పించలేదు. దీంతో అటాచ్డ్​ బాత్​ రూమ్స్​ను కొందరు స్నానాలకు, మరికొందరు సామాన్లు భద్రపర్చుకునేందుకు వినియోగిస్తున్నారు. ఇక బహిర్భూమికి మహిళలు, పురుషులు సమీపంలో ఉండే వ్యవసాయ పొలాల్లోకే వెళ్తున్నారు. 
  • ఈ 32 కుటుంబాలకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన నీటి సంప్​ ఖాళీగా ఉంది. ఇందులోకి నీటిని నింపే పైపులైన్​ కనెక్షన్​లు లేవు. ప్రతీ ఇంటికి నీటిని అందించేందుకు మిద్దెలపై వెయ్యి లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్​ ట్యాంకులను ఏర్పాటు చేశారు. కానీ అవి నిరుపయోగంగానే మారాయి. అవి ఎండుకు ఎండి, వానకు నాని కొన్ని పగిలిపోయాయి. 
  • 32 కుటుంబాలకు ఒక్కటే మిషన్​ భగీరథ కనెక్షన్ ఉంది. తాగేందుకు నీటిని అందరూ అక్కడికే వచ్చి పట్టుకోవాల్సిందే.
  • సెప్టిక్​ ట్యాంక్​ కోసం తవ్వకాలు చేపట్టి వదిలేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో అందులోకి నీరు చేరితే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.  డ్రైనేజీ కనెక్షన్​లు సరిగా లేవు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం డ్రైనేజీ నీరు లీకవుతోంది. చిన్న పిల్లలు అక్కడే బాత్​ రూమ్​లకు వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా  కంపుకొడుతోంది. మురుగు నిల్వ ఉంటుండడంతో దోమలు పెరుగుతున్నాయి. 
  • ఇండ్లకు ప్రత్యేక ట్రాన్స్​ఫారం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం లేదు. సమీపంలోని కరెంటు పోల్​ నుంచి ఒక సర్వీస్ వైర్ నుంచి  32 ఇండ్లకు కనెక్షన్ తీసుకున్నారు. ఇక్కడ వైర్లు బయటే ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఇండ్ల వద్ద ఉన్ హైమాస్ట్​ లైట్లు వెలగడం లేదు. స్ట్రీట్​ లైట్లను ఏర్పాటు చేయలేదు. తరచూ పాములు వస్తున్నాయి. ఇటీవల స్థానికులే అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించారు.