
వికారాబాద్, వెలుగు: భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన తనిఖీ చేశారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. దరఖాస్తుల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడాన్ని పరిశీలించారు.
అర్జీదారులకు రశీదులు ఇవ్వాలని సూచించారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, రికార్డులను పొందుపర్చాలని ఆదేశించారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను స్పాట్లో సాల్వ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
దివ్యాంగులకు శస్త్ర చికిత్స చేయించాలి..
వైకల్యం కలిగిన వారిని గుర్తించి శస్ర్త చికిత్సలు చేయించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ భవనంలో ఆకర్ ఆశ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగ వైకల్య పరీక్షలపై అవగాహన కల్పించారు. కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. శస్త్ర చికిత్సల సందర్భంలో ఉచిత భోజన, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్లాస్టిక్ సర్జరీలు ఉచితంగా చేయడానికి ముందుకు వచ్చిన ఆకర్ ఆశ ట్రస్ట్ను కలెక్టర్ అభినందించారు.