
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్య, వైద్యరంగాలకు నిధులను తగ్గిస్తున్నాయి. అధికారం కొనసాగింపునకు కావలసిన ఓట్ల వేటలో జనాకర్షణ పథకాలు.. రూపాయికి కిలో బియ్యం మొదలగు కార్యక్రమాలు ప్రారంభించి సమాజాభివృద్ధికి తోడ్పడే కీలకరంగాలను ప్రైవేటు రంగానికి వదిలివేయడం జరిగింది. రాజధాని హైదరాబాద్, ఇతర ముఖ్యమైన జిల్లా కేంద్రాలలో కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, చివరికి విశ్వవిద్యాలయాలను అనుమతిస్తూ ప్రభుత్వ విద్యారంగానికి నామమాత్రపు అరకొర నిధులు కేటాయిస్తున్నారు. మానవాభివృద్ధినీ నిర్లక్ష్యం చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
గత ప్రభుత్వ నిర్వాకం..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ, శ్రామిక రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. విద్యార్థి, ఉద్యోగ, మేధావి వర్గం 60 సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి అనేకమంది ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ స్వరాష్ట్రంలోనూ.. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని గాలికి వదిలివేసి ఉపాధ్యాయ, అధ్యాపక రిక్రూట్మెంట్ను ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో నిషేధించింది.
అవినీతే లక్ష్యంగా పెట్టుకున్న భారీ ప్రాజెక్టులతో పాటు ఓట్ల ఆకర్షణ లక్ష్యంతో పేదలకు నిరర్థక, నిరుపయోగమైన పథకాలకు ప్రాధాన్యత ఇచ్చి మానవాభివృద్ధి రంగాన్ని ఉద్దేశ పూర్వకంగానే బానిస రాజ్యంలో నవాబుల లాగ అణచివేయడం జరిగింది. అనేక ప్రభుత్వ విద్యాసంస్థలలో కనీసం బాలికల కోసం మరుగుదొడ్లు లేని పరిస్థితి, తాగడానికి మంచినీరు లేదు. విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. కంప్యూటర్లు, లేబరేటరీలు ఆధునికీకరణ చేయక, పాఠశాల గదులు, పరిసరాలను పరిశుభ్రంగా పెట్టే సిబ్బంది లేక పాఠశాల భవనానికి తగిన మరమ్మతులు లేక ప్రభుత్వ విద్యను గాలికి వదిలేశారు.
పదేండ్లుగా..
అన్ని సబ్జెక్టులు బోధించగలిగే ఉపాధ్యాయుల కొరత ఏర్పడడం, రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు తగిన నియంత్రణ వ్యవస్థలు లేకపోవడం, పేరుకుపోయిన అవినీతి, నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి పాఠశాల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ ఖర్చులకు కూడా ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడం, పాఠశాల నిర్వహణలో కుల సంఘాలు, ఇతర సంఘాల జోక్యం, ఇంకా అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించలేకపోయాయని అనేక నివేదికలు, మీడియా రిపోర్టులు తెలియచేస్తూనే ఉన్నాయి.
ఒకప్పటి ఉపాధ్యాయులు నేడు ఉన్నారా ?
కొద్ది సంవత్సరాల నుంచి ప్రభుత్వం జూన్, జులై మాసాలలో నిర్వహిస్తున్న బడిబాట సందర్భంలో ఇంటింటికి తిరుగుతున్న ఉపాధ్యాయులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసంతృప్తిని వ్యక్తీకరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల కోసం పాటుపడే ఉపాధ్యాయులు కూడా ఉన్నప్పటికీ అత్యధికులు ఉదాసీన వైఖరి ప్రదర్శించడం సర్వత్రా గమనించవచ్చు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులను సొంత పిల్లలు లాగా భావించి విద్యా బుద్ధులతో పాటు సామాజిక విలువలు, వారి వ్యక్తిత్వ నిర్మాణం, ఉజ్వల భవిష్యత్తు కోసం బాటలు వేసేవారు. అలా ఎదిగిన విద్యార్థులే ఇప్పటికీ దేశానికి అనేక రంగాల్లో దిశా దశ చూపిస్తున్నారని మనం గర్వపడాలి.
తగ్గిన విశ్వసనీయత
గత 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ విద్యా రంగంలో రకరకాల అవాంఛనీయమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని, విధులను సంపూర్ణంగా నిర్వర్తించడంలో అనేకమంది ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనేక సందర్భాల్లో మీడియా పాలకుల ముందు పెడుతూనే ఉంది. పూర్వం ఎంతో ఆదరణకు గురైన ఉపాధ్యాయ వృత్తిని, ప్రస్తుతం విధులను యాదృచ్ఛికంగా నిర్వహిస్తున్నారని అపవాదును మోస్తున్నారు, ప్రైవేటీకరణలో భాగంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఆకర్షణీయమైన ప్రచారాలు, విద్యార్థుల వేటలో ఇంటింటికి తిరుగుతున్న ఏజెంట్లు, విద్యార్థులకోసం వీధుల్లో చక్కర్లు కొడుతున్న రంగురంగుల బస్సులు, మార్కులు, ర్యాంకులు లక్ష్యంగా ప్రచారం చేస్తూ పేద ప్రజలను ఆకర్షించే ప్రతి ఊరికి అరడజను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల బస్సులు పిల్లల వేటలో తిరుగుతున్న పరిస్థితులు తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్న విషయాలను తక్కువ అంచనా వేయలేం. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యపై సాధారణ ప్రజలకు విశ్వసనీయత తగ్గిందని ఒప్పుకోక తప్పదు.
బతుకు బాట చదువులు కావాలె
ప్రతి సంవత్సరం బడిబాట పెట్టడం, ఇంటింటికి తిరగడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఫార్మసీ మొదలగు ఉపాధి అవకాశాలు ఇచ్చే శాస్త్ర సాంకేతిక విద్యకు బేసిక్ ఫౌండేషన్ కోర్సుల బోధనతో పాటు ఉపాధ్యాయుల అంకిత భావంతో గుణాత్మకమైన మార్పులు రాకుండా సాధారణ ప్రజలను ప్రభుత్వ బడిబాటకు మరల్చడం కష్టతరమే.
కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే తల్లిదండ్రులను ఒప్పించలేదు. ప్రభుత్వ విద్యపట్ల ప్రజల విశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక మార్పులు అమలుపరిచి వ్యక్తిత్వ వికాసంతోపాటు బతుకు బాట చూపించే విద్యను కల్పించాలి. ఉపాధ్యాయులు మొక్కుబడిగా విధులను నిర్వర్తించే పద్ధతిని మానుకోవాలి. అంకితభావంతో బోధనచేసి తల్లిదండ్రుల మన్ననలను పొందిననాడే బడిబాట అవసరం లేకుండానే పేద విద్యార్థులతోపాటు, మధ్యతరగతి విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఇష్టపడతారని గుర్తిద్దాం.
వ్యాపారాల మోజు.. బోధనకు అన్యాయం
సమస్యల కంటే ముఖ్యంగా ప్రస్తుత సమకాలీన పరిస్థితులలో ఉపాధ్యాయులలో యాంత్రిక వైఖరి ఏర్పడడం పేద విద్యార్థులకు శాపంగా మారింది. వృత్తికి కళంకం తెచ్చేవిధంగా విద్యాశాఖలో అవినీతి అధికారుల అండదండలతో కొంతమంది ఉపాధ్యాయులు బినామీల పేరుతో రియల్ ఎస్టేట్, చిట్ఫండ్స్, ఇన్సూరెన్స్ మొదలగు ఇతర వ్యాపారాల పట్ల ఆకర్షితులై ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆనాటి ఉపాధ్యాయులలో ఉన్న అంకితభావం చాలావరకు కొరవడిపోయింది.
కూరపాటి వెంకట్ నారాయణ, ప్రొఫెసర్ (రిటైర్డ్)