- ఔటర్కు అవతల.. ట్రిపుల్ఆర్కు ఇవతల కొత్త పారిశ్రామిక వాడలు
- 500 – 1000 ఎకరాల మేర భూములను గుర్తించండి: సీఎం రేవంత్
- సాగుకు యోగ్యం కాని భూములనే పరిశ్రమల కోసం సేకరించండి
- గత ప్రభుత్వంలో పరిశ్రమలకు కేటాయించిన ల్యాండ్స్ వివరాలివ్వండి
- రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్షలో అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కొత్త పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు అవతల, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు లోపల 500 నుంచి 1000 ఎకరాల మేర భూములను గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇవి కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల లోపే ఉండాలని సూచించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కోసం సేకరించే భూములు.. బంజరు, సాగుకు యోగ్యం కానివై ఉండాలని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు నష్టం జరగదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పరిశ్రమలకు కేటాయించిన భూములు, అందులో పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా ఉన్న భూములపై పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అనేక కంపెనీలకు పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఆ భూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక సమర్పించండి” అని ఆదేశించారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యతనివ్వాలని, హైదరాబాద్లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలని పేర్కొన్నారు.
బంజరు భూములను గుర్తించండి
రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆయా భూముల ధరలు తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని అన్నారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ కాకుండా సోలార్ పవర్ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఊర్లను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. బాలానగర్ లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. సమీక్షకు సీఎస్ శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తదితర అధికారులు హాజరయ్యారు.