భూ కుంభకోణంలో ఐటీ మంత్రి కేటీఆర్: రేవంత్ రెడ్డి

భూ కుంభకోణంలో  ఐటీ మంత్రి కేటీఆర్: రేవంత్ రెడ్డి
  • తిమ్మాపూర్ లో భారీ గోల్ మాల్
  • 146 ఎకరాలు.. వెయ్యికోట్ల కుంభకోణం
  • సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరగాలి
  • ధరణిలో 30% కమీషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్లు
  •  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారీ భూకుంభకోణం జరిగిందని, దాని వెనుక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన అనుచరులు ఉన్నారని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలోని 146 ఎకరాల భూమి ఎవరికీ తెలియకుండా నిషేధిత జాబితాలోకి వెళ్లిందన్నారు. దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తముందన్నారు. ధరణి పోర్టల్ రాగానే ఈ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని, వాటి విలువ రూ. వెయ్యి కోట్లు ఉంటుందని చెప్పారు. కేసీఆర్ దండు పాళ్యం ముఠా తమ కోసమే ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని రేవంత్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని భూదాన్ భూములు మాయమయ్యాయని ఆరోపించారు. ధరణిలో ఉన్నంత దోపిడీ మరెందులోనూ లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భూలావాదేవీలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన కలెక్టర్లతో ఊచలు లెక్కపెట్టిస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 23వేల ఎకరాల భూదాన్ భూములు గల్లంతయ్యాయని, అవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయో లెక్కలు తీస్తామని రేవంత్ తెలిపారు. 30% కమీషన్ ఇస్తేనే కలెక్టర్లు సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని, అంతకన్నా అడ్వాన్స్ టెక్నాలజీ తో కూడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు

అత్యంత అవినీతి పరుడైన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని, ఆయన కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు అక్కడే ఉండొచ్చని, ఆ ఏర్పాట్లు కూడా చేస్తామని రేవంత్ అన్నారు.