తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ 2024 మార్చి31వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన నాలుగు లోక్సభ స్థానాల అభ్యర్థులపై అధిష్టానంతో కలిసి చర్చించనున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ తీసుకుంది. కాగా ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. రేపటితో ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులెవరో క్లారిటీ రానుంది.
మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.