పద్మారావునగర్, వెలుగు: భర్త చనిపోయిన తర్వాత అత్తింటి వారు తనను, తన కూతురిని ఇంట్లోకి అనుమతించడం లేదని, కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఓ ఎన్నారై మహిళ ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. వరంగల్కు చెందిన రజితకు, సికింద్రాబాద్ పికెట్ ఎల్ఐసీ కాలనీకి చెందిన రాము మంచాలతో వివాహమైంది.
ఆ తర్వాత వారు అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వీరికి త్రిష అనే కూతురు ఉంది. 2023లో రాము అనారోగ్యంతో చనిపోగా, తనను, తన కూతురును ఇంట్లోకి రానివ్వడం లేదని రజిత ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్తిలో తమకు ఎలాంటి హక్కు లేదని వేధిస్తున్నారని వాపోయింది. లీగల్ హెయిర్(వారసత్వ) సర్టిఫికెట్లో తన భర్త పేరు చేర్చకుండా అన్యాయం చేశారని తెలిపింది. అత్తింటి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు నిరాకరించడంతో గురువారం రాత్రి నుంచి అత్తింటి ముందు బైఠాయించింది.
