వంగూరు, వెలుగు: ‘సర్’ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్అధికారులకు సూచించారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం వెలమలపల్లి గ్రామంలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. సర్ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, తాహసీల్దార్ మురళీమోహన్ ఉన్నారు.
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కల్వకుర్తి : నాగర్కర్నూల్ జిల్లా ఉర్కొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, సభా వేదిక, పార్కింగ్, కాన్వాయ్ మార్గాలను పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన ఏఎస్ఎల్ సమావేశంలో భద్రత, ట్రాఫిక్, వైద్య సేవలు, అగ్నిమాపక, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చి. వాసుదేవ రెడ్డి, డీఎస్పీలు ఎ. శ్రీధర్ రెడ్డి, డి. కృష్ణ, అడిషనల్ కలెక్టర్లు అరుణా రెడ్డి, దేవ సహాయం, ఆర్డీవో జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.
