
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఒక్కొక్కరికి చాన్స్.. ఈ నెల 30న ఖర్గేతో చర్చించాక అధికారిక ప్రకటన
- రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్, మహేశ్ గౌడ్ భేటీ
- మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై లిస్ట్ ఇచ్చిన కేసీ వేణుగోపాల్!
- అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్తో మాట్లాడిన రాహుల్
- ప్రకృతి చికిత్సలో ఉన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. 30న ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం
- హైదరాబాద్కు తిరుగుపయనమైన సీఎం రేవంత్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో కొత్తగా నలుగురికి చాన్స్ దక్కనుంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్కు తుది మెరుగులు దిద్దుతున్నది. వాస్తవానికి మంగళవారమే ప్రకటన రావాల్సి ఉన్నా.. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అందుబాటులో లేకపోవడంతో ఈ నెల 30కి వాయిదా పడింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. అయితే.. చికిత్సను డాక్టర్లు మరో రెండు రోజులు పొడిగించారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 30న ఖర్గే ఢిల్లీకి చేరుకోనున్నారు. కాగా, కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడటంతో సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వెనుదిరిగారు.
రాహుల్తో సమావేశాలు
సోమవారం ఢిల్లీ టెన్ జన్పథ్లోని సోనియాగాంధీ ఇంట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పార్టీ వ్యవహారాల జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత కేసీ వేణుగోపాల్ కేరళలోని నీలంబూర్ అసెంబ్లీ బై ఎలక్షన్ కు సంబంధించి పార్టీ అభ్యర్థి ప్రకటనపై రాహుల్తో చర్చించారు. ఆర్యదన్ షౌకత్ను బరిలో నిలపాలని నిర్ణయించారు. అనంతరం తెలంగాణ మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ నూతన కార్యవర్గం అంశాలను రాహుల్ కు బ్రీఫ్ చేసినట్లు తెలిసింది.
నాలుగు మంత్రి పదవుల భర్తీకి సంబంధించి ఏడుగురి పేర్లు ప్రయారిటీలో ఉన్నాయని వివరించారు. దానిపై లిస్ట్ అందజేసినట్లు తెలిసింది. అలాగే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, తక్కువ సంఖ్యతో కూడిన పీసీసీ కార్యవర్గ లిస్ట్ ను సమర్పించినట్లు సమాచారం. అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ను కలిశారు. మహేశ్గౌడ్ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన రాహుల్.. తర్వాత ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, కవిత లేఖ, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేపట్టాలని, అందులో బీసీలకు రెండు పదవులు ఇవ్వాలని రాహుల్ను మహేశ్గౌడ్ కోరినట్లు తెలిసింది. అలాగే కార్యవర్గంలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పదవుల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు.
ఒకటీ రెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం: మహేశ్గౌడ్
వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సానుకూలంగా స్పందించారని, త్వరగా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్తో భేటీ అనంతరం మీడియాతో మహేశ్గౌడ్ మాట్లాడారు. మర్యాదపూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అంశాలను వివరించినట్లు తెలిపారు. ‘‘మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పినం. కేబినెట్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని కోరినం. త్వరగా కేబినెట్ కూర్పు చేపట్టాలని రాహుల్కు విజ్ఞప్తి చేసిన. త్వరలో ఉంటుందని ఆశిస్తున్న. ఒకటీరెండు రోజుల్లో పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుంది’’ అని ఆయన వెల్లడించారు.
సీఎంతో పీసీసీ చీఫ్ భేటీ
రాహుల్ తో భేటీ అనంతరం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేరుగా తుగ్లక్ రోడ్ 23 లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకున్నారు. దాదాపు అరగంట పాటు సీఎం రేవంత్రెడ్డితో చర్చించారు. రాహుల్ తో భేటీ సందర్భంగా జరిగిన అంశాలను బ్రీఫ్ చేశారు. ప్రస్తుతం ఖర్గే అందుబాటులో లేనందున ఈ నెల 30కి మీటింగ్ ను వాయిదా వేసిన విషయాన్ని వివరించారు. కాగా, రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి బయలుదేరారు. ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం మరోసారి కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైనట్లు తెలిసింది. దాదాపు గంటపాటు చర్చ జరిగినట్లు ఢిల్లీలో ప్రచారం సాగింది. అయితే, ఈ భేటీని సీఎంవో కానీ, పార్టీ వర్గాలు కానీ ధ్రువీకరించలేదు.
ఆరింటిలో.. నాలుగింటిపై ఫోకస్
ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు. 18 మంది వరకు ఉండొచ్చు. ఆరు బెర్త్లు ఖాళీగా ఉండగా.. ఇప్పుడు నాలుగు పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఈ నాలుగింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లో ఒక్కొక్కరికి కేటాయించనున్నారు. వీటికి ఏడుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో కొందరి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఒక వేళ ఐదో బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే.. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని మైనార్టీకి కేటాయించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. తాత్కాలికంగా ఈ ఐదో బెర్త్ భర్తీని ఆపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి.. మరో ఓసీకి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.