
సింగరేణి కార్మికుల సమస్యలకు కేసీఆరే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోడు భూములపై కేసీఆర్ లో గుబులు పుట్టిందన్నారు. గిరిజనులు, ఆదివాసీలు కాంగ్రెస్ కు అండగా ఉంటున్నారని..అందుకే పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. మంచిర్యాల ప్రాంతంలో పోడు భూముల గురించి చంటి పిల్లలపై దాడులు చేయిస్తే సీతక్క అండగా నిలిచిందని గుర్తు చేశారు. తాడ్వాయి అడవుల్లో అడబిడ్డలను చెట్లకు కట్టేసి కొడితే తాము వెళ్లి అండగా నిలిచామని రేవంత్ చెప్పారు. 2024, జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన అందరికీ పోడు భూముల పట్టాలు ఇస్తామని భరోసా ఇచ్చారు.
తొమ్మిదేళ్లుగా పోడు భూములకు కేసీఆర్ ఎందుకు పట్టాలివ్వలేదని? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సభకు వెళితే పోడు భూములకు పట్టాలు రావని చెబుతున్నారని.. పోడు భూములకు పట్టాలు ఎలా రావో చూస్తానని హెచ్చరించారు. పట్టాలు ఇవ్వకుంటే ఓట్లు కోసం వస్తే.. ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. గిరిజనులు కేసీఆర్ భూమి అడిగారా..? కేసీఆర్ బ్యాంకులో దాచుకున్న కోట్లను అడిగారా అని నిలదిశారు. అర్హులైనవారికి 11 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలిచే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు, కష్టాల్లో ఉన్న వారికి అభయం ఇచ్చే హస్తం కాంగ్రెస్ అని..అభయ హస్తం మిమ్మల్ని కాపాడుతుందని రేవంత్ పేర్కొన్నారు.