తుది దశకు నామినేటెడ్ పదవుల భర్తీ

 తుది దశకు నామినేటెడ్ పదవుల భర్తీ
  • కసరత్తు పూర్తి చేసిన సీఎం రేవంత్
  • జులై మొదటి వారం నుంచి ప్రకటన

హైదరాబాద్, వెలుగు: నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. శుక్రవారం ఇంటికే పరిమితమైన సీఎం రేవంత్.. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు ఎన్ని? అవేవి? ఎవరిని నియమించాలి? అనేదానిపై రోజంతా కసరత్తు చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు జిల్లాల నుంచి ఇన్​చార్జ్ మంత్రులు పంపిన సిఫార్సు జాబితా ఆధారంగా కీలకమైన కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలనే దానిపై రేవంత్ ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. 

4  రోజుల కింద జరిగిన పీఏసీ సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యంపై చర్చించారు. ఇన్​చార్జ్ మంత్రుల నుంచి దీనికి సంబంధించిన జాబితాలు తనకు అందకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా మంత్రుల నుంచి సీఎంకు సిఫార్సులు చేరినా.. ఇన్​చార్జ్ మంత్రులు ఇచ్చే జాబితా ఆధారంగానే రేవంత్ తుది నిర్ణయానికి రానున్నారు.

పీఏసీ మీటింగ్ తర్వాత పలు జిల్లాల ఇన్​చార్జ్ మంత్రులు సీఎంకు జాబితాలు అందజేసినట్లు తెలిసింది. కాగా, ఆర్టీసీ, రెడ్కో, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్, మెడికల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, బేవరేజెస్ వంటి కీలక కార్పొరేషన్లకు చైర్మన్​లను భర్తీ చేయాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో కసరత్తు పూర్తి కానున్నది. జులై మొదటి వారం నుంచి విడతలవారీగా నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. పలు జిల్లాల్లో ఇంకా కొన్ని మార్కెట్, ఆలయ కమిటీలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. వాటిపై కూడా జిల్లా స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.