దళితులను తెలంగాణ ఉద్యమంలో పావులుగా వాడుకున్నారు

దళితులను తెలంగాణ ఉద్యమంలో పావులుగా వాడుకున్నారు

సీఎం కేసీఆర్ దళిత బంధును ఇవాళ హుజురాబాద్ లో ప్రారంభించడంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులను తెలంగాణ ఉద్యమంలో పావులుగా వాడుకున్నారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి మాట తప్పారని, నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని ఆరోపించారు. ఇవాళ ప్రారంభించిన దళితబంధు సభలోనూ కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

దళితులకు అన్యాయం చేసినవాళ్లలో మొదటి దోషి కేసీఆరేనని అన్నారు.హుజురాబాద్ లో గెలవడానికి ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా దిగజారిపోయారన్నారు. గెలుపు కోసం ఆఖరికి శోభమ్మను కూడా రంగంలోకి దింపారని తెలిపారు. రాజకీయంగా కేసీఆర్ కు దళిత బంధు సభనే చివరిదని స్పష్టం చేశారు.

త్వరలోనే హుజూరాబాద్ లో తుపాను రాబోతోందని.. అందులో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత-గిరిజన సభ తర్వాత కాంగ్రెస్ తదుపరి లక్ష్యం హుజురాబాదేనని అన్నారు. కేసీఆర్ సభ జరిపిన ప్రదేశంలోనే కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.