సీఎం కేసీఆర్ కు ప్రకృతే బుద్ధి చెబుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, ఇసుక, వైన్ అమ్ముకున్నోడు ఎప్పటికీ బాగుపడరని విమర్శించారు. బీఆర్ఎస్ లీడర్లు ప్రకృతిని నాశనం చేస్తున్నారని విమర్శించారు.. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాతో వాగులు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మానుకొండూరు వాగును చూసి తాను షాకయ్యానని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. మూసధోరణిలో వ్యవసాయం చేయకుండా చూస్తామన్నారు. రైతుల్లో అవగాహన కల్పించి పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే.. రైతులు బాగుపడతారని చెప్పారు. తెలంగాణలోని భూముల్లో ఒకప్పుడు 23 రకాల పంటలు పండించే వారు ఇపుడు రెండు మూడు పంటలకే పరిమితం అయ్యారని విమర్శించారు.
అధిక దిగుబడి కోసం రసాయనాలతో పండించే పంట తిని నేటి తరం వ్యాధుల బారిన పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. 18 ఏళ్లకే గుండపోటు రావడం కూడా ఇందుకు సంకేతమన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు. పాలకుర్తిలో ఓ పీజీ చేసిన వికలాంగుడి కష్టాలు చూసి తనకు కన్నీళ్లు పెట్టించాయన్నారు. వికలాంగుల సంక్షేమాన్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.